సోమేశ్ కుమార్ వ్యక్తిగత హోదాలో వేసిన కేసులో హైకోర్టు
హైదరాబాద్, మార్చి 10 : కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఆదేశాల మేరకు ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని సర్కారు ఈ నెల 14లోగా సర్వీసులోకి తీసుకుంటుందో లేదో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. క్యాట్ ఆదేశాలపై స్టే జారీ చేస్తే అదే తరహా క్యాట్ ఆదేశాలు పొందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, మరో 15 మంది కేంద్ర సర్వీస్ అధికారులకు కూడా స్టే వర్తిస్తుందని వెల్లడించింది. మొహంతిని సర్వీసులోకి తీసుకొనేటప్పుడు హైకోర్టు తీర్పునకు లోబడి ఉంటుందనే షరతు విధించవచ్చునని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎ వెంకటేశ్వర్రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.