హైకోర్టు ఉత్తర్వులు
హైదరాబాద్, ఫిబ్రవరి 22 : రుణ యాప్ల ద్వారా ప్రజలను వేధించిన వ్యవహారంలో పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి జప్తుచేసిన రూ.15 కోట్లను విడుదల చేయాలన్న హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావిలి ధర్మాసనం మంగళవారం విచారణ జరిపి, యథాతథ స్థితి (స్టేటస్కో)ని కొనసాగించాలని ఉత్తర్వులు జారీచేసింది. పీసీ ఫైనాన్షియల్ సంస్థ రూ.178 కోట్ల పెట్టుబడితో 2000% వడ్డీతో అప్పులిచ్చి రూ.11,717 కోట్ల లాభాలు గడించిందని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. మన దేశంలో పన్నుల ఎగవేతకు పాల్పడుతున్న ఈ సంస్థను చైనాకు చెందిన గేమ్ డెవలపర్ ‘జోయా హుయి’ నిర్వహిస్తున్నదని, ఇది 2.2 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీ అని తెలిపారు. సీజ్ చేసిన డబ్బును విడుదల చేయకపోతే తమ సిబ్బందికి జీతాలు చెల్లించలేమని చెప్పి ఈ సంస్థ సింగిల్ జడ్జి నుంచి ఉత్తర్వులను పొందినప్పటికీ అందుకు ఆధారాలు చూపలేదని పేర్కొన్నారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ఆ సంస్థను ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణను వచ్చే నెలకు వేసింది.