Statue Of Equality | ముచ్చింతల్లో ఏడో రోజు సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేడు రథసప్తమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దుష్టగ్రహ బాధల నివారణ కోసం యాగశాలలో శ్రీ నారసింహ ఇష్టి కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సర్వవిధ పాప నివారణ కోసం శ్రీమన్నారాయణ ఇష్టి, లక్ష్మీనారాయణ మహాక్రతువు, చతుర్వేద పారాయణం చేపట్టనున్నారు. ప్రవచన మండపంలో శ్రీనారసింహ అష్టోత్తర శతనామావళి పూజతో పాటు సామూహిక ఆదిత్య పారాయణం సహా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ సాయంత్రం ముచ్చింతల్కు రానున్నారు. మంగళవారం సాయంత్రం 4:40 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు అమిత్ షా చేరుకోనున్నారు. ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గంలో ముచ్చింతల్కు చేరుకుంటారు.
ముచ్చింతల్లోని సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించి, రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకోనున్నారు. అనంతరం 108 దివ్య క్షేత్రాలను పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. యాగశాల పూజల్లో పాల్గొననున్నారు. రాత్రి 8 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి అమిత్ షా తిరిగి వెళ్లనున్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో ముచ్చింతల్, శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.