హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆలోచనా విధానం మేరకు రాష్ట్ర మహిళా కమిషన్ సమర్థవంతంగా పని చేయాలని, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆకాంక్షించారు. గత ఏడాది కాలంగా కమిషన్ బాగా పని చేస్తోందని, మహిళా సమస్యల పరిష్కారంలో దేశంలో మన రాష్ట్ర కమిషన్ ముందంజలో ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు జరిగి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి బుధవారం బుద్ధ భవన్ లో జరిగిన కమిషన్ వార్షికోత్సవంలో పాల్గొని కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ..చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డికి మాజీ మంత్రిగా, సీనియర్ రాజకీయ నేతగా మంచి అనుభవం ఉంది. ఆమె అనుభవం ఈ కమిషన్ కు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మహిళల సమస్యలపై అవగాహన ఉన్న వారు సభ్యులుగా ఉండడం వల్ల రాష్ట్ర మహిళల సమస్యల పరిష్కారంలో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మహిళల భద్రత, పోషణ కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో షీ టీమ్స్, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, వారి రక్షణకు పటిష్ట చర్యలు చేపడుతున్నారని మంత్రి తెలిపారు. సమాజంలో మహిళలకు రక్షణ ఉండాలంటే సమాజంలో, ముఖ్యంగా మగవాళ్లలో మార్పు రావాలన్నారు.
మహిళకు యూనివర్సిటీ ఉండాలి అని కేబినెట్లో చెప్పినప్పుడు సీఎం కేసీఆర్ ఒప్పుకుని వెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పినందుకు వారికి ధన్యవాదాలన్నారు. అనంతరం కమిషన్ వార్షికోత్సవం సందర్భంగా వార్షిక నివేదిక విడుదల చేసి, మహిళలపై రూపొందించిన పాట సీడిని ఆవిష్కరించారు. సమావేశంలో మహిళా కమిషన్ సభ్యులు, అధికారులు, సిబ్బంది, వివిధ మహిళా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.