హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21 నుంచి 27 వరకు ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమం నిర్వహించినట్టు రీజినల్ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 21న తెలుగు రాష్ర్టాలకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోల ప్రదర్శనను నిర్వహించామని, 22న మహబూబ్ కళాశాలతో పాటు డీఆర్ఎస్ పాఠశాల విద్యార్థుల కోసం పెయింటింగ్ పోటీలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. 23న పరేడ్గ్రౌండ్లోని సైనిక అమరుల స్మారక స్థూపం వరకు 100 మంది సైక్లిస్ట్లతో కలిసి ర్యాలీ నిర్వహించిన అనంతరం నివాళులర్పించామని తెలిపారు. 24 నుంచి పాస్పోర్టు కార్యాలయం నుంచి అందించిన సేవలపై ఫొటో ప్రదర్శన నిర్వహిస్తున్నామని వివరించారు. 25న ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటినట్టు పేర్కొన్నారు. 26న స్వాతంత్య్ర సమరయోధుల ఫొటో ప్రదర్శనను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సందర్శించారని, 27న మాదాపూర్లోని శిల్పారామంలో పలువురు కళాకారులు సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారని, పెయింటింగ్, నృత్యంలో పాల్గొన్న వారందరినీ మాదాపూర్ డీసీపీ, ముఖేశ్ కౌశిక్ అభినందించారని తెలిపారు.