హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎస్సై, ఏఎస్సై తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 587 పోస్టు ల్లో 434 మంది పురుషులు, 153 మంది మహిళలు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) కీలకమైన కటాఫ్ మార్కుల ప్రక్రియను పూర్తిచేసింది. తాజాగా ఫలితాలను, ఎంపికైన అభ్యర్థులను వెల్లడించింది. టీఎస్ఎల్పీఆర్బీ 2022లో నోటిఫికేషన్ వెలువరించి, 587 ఎస్సై, ఏఎస్సై పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించగా, దాదాపు 2.47 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. నిరుడు ఆగస్టు 7న ప్రాథమిక రాత పరీక్షతో నియామక ప్రక్రియ ప్రారంభమైంది.
విద్యార్హతలు, రిజర్వేషన్, స్థానికత, వయసు సడలింపు, హారిజెంటల్ రిజర్వేషన్, ఇతర బెనిఫిషరీలను పరిగణనలోకి తీసుకొని తుది జాబితాను విడుదల చేశామని టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల గుణగణాలు, ప్రవర్తన, క్రిమినల్ కేసులపై ఆరా తీయనున్నట్టు వెల్లడించారు. సోమవారం టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్లో కటాఫ్ మార్కుల వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. ఈ నెల 14 నుంచి అటెస్టేషన్ ఫార్మ్ పూర్తి చేయాలని తెలిపారు. అభ్యర్థులకు అభ్యంతరాలుంటే ఈ నెల 9 వరకు నిర్ణీత రుసుము చెల్లించి నివృత్తి చేసుకోవాలని కోరారు. గరిష్ఠంగా పది రోజుల్లోనే స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) విభాగంతో విచారణ జరిపించిన అనంతరం అభ్యర్థులకు ఎంపిక లేఖలు పంపనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. ఆగస్టు రెండోవారంలోపు అర్హుల జాబితాను పోలీసు విభాగాలకు పంపిస్తారు.