సీఎం కేసీఆర్ వెంటే ప్రజలు
రవాణాశాఖ మంత్రి పువ్వాడ
ఖమ్మం, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గులాబీ జెండా నీడలోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తన రాజకీయ ఉన్నతికి కారకులైన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కోసం అవసరమైతే మెడ కోసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశారు. ఎవరెన్ని కుట్రలు చేసిన సీఎం కేసీఆర్ను ఏమీ చేయలేరని, ఆయనను ఢీకొట్టడం ఎవరితరం కాదన్నారు. శనివారం ఖమ్మంలో జరిగిన నగర, మండల నూతన కమిటీల బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం నగర అధ్యక్షుడిగా ఎన్నికైన పగడాల నాగరాజు, రఘునాథపాలెం మండల అధ్యక్షుడిగా ఎన్నికైన అజ్మీరా వీరు నాయక్కు అభినందనలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఎవరితో ఎవరు ఏకమైన ప్రజల గుండెల్లో కేసీఆర్కు స్థానం ఉన్నంత వరకు ఎవరి కుట్రలు పారవని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలవైపు యావత్తు దేశం చూస్తున్నదని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు హరిప్రియానాయక్, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.