హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఎన్నికల ప్రచారంలో తాను ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలవకపోతే సంక్షేమ పథకాలను ఆపేస్తామని తాను ఎక్కడా చెప్పలేదని వివరించారు. ఈ మేరకు ఆయన శనివారం కేంద్ర ఎన్నికల సంఘం నోటీసుకు వివరణ ఇచ్చారు. తాను కేవలం తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మాత్రమే వివరించానని, ఈ పథకాలపై బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించానని తెలిపారు.
ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ మాదిరి పథకాలను అమలు చేయడంలేదని, మరి ఇక్కడ ఎలా అమలు చేస్తుందో ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించినట్టు తెలిపారు. రెండు పార్టీల పాలనాలో తేడాను ప్రజలకు వివరించడం ఎన్నికల ఉల్లంఘన కాదని చెప్పారు. ఇతర పార్టీలు ఓటర్లను తప్పుదోవ పట్టించేలా ఉద్దేశపూర్వకంగా అబద్ధాలను ప్రచారం చేసినప్పుడు వాస్తవాలను తెలియజేయడం నిబంధనల ఉల్లంఘన కాదన్నారు.
రుద్దేశంతోనే తనపై ఫిర్యాదు చేశారనే విషయాన్ని గుర్తించి తనకు జారీచేసిన నోటీసును రద్దు చేయాలని ఈసీని కోరారు. ఈసీ నోటీసుకు జవాబు ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో ఓటమి పాలు అవుతామన్న భయంతోనే బీజేపీ తనపై ఎన్నికల సంఘానికి తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నదని విమర్శించారు.
మునుగోడు, అక్టోబర్ 29: తెలంగాణ ప్రభుత్వాన్ని నెల రోజుల్లో పడగొడతామన్న అమిత్షా .. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం బెడిసికొట్టడంతో బొక్కబోర్లా పడ్డారని మంత్రి జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. మునుగోడులో ఓటమిని బీజేపీ ఇప్పటికే ఒప్పుకొన్నదని అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని కోరుతూ మునుగోడు పట్టణంలో శనివారం భారీర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ కూడా అమ్ముడుపోయిన ఎమ్మెల్యేనే అభ్యర్థిగా పెట్టుకున్నదని ఎద్దేవాచేశారు.
నిఖార్సయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరని, ఎంత ప్రలోభపెట్టినా తమ నిజాయితీని చాటుకున్నారని స్పష్టం చేశారు. రాజగోపాల్రెడ్డి మాత్రం రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయి నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో బీజేపీ పెద్దల కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు. మోదీ నుంచి రక్షించాలని బీజేపీ పాలిత రాష్ర్టాల ప్రజలూ కోరుకుంటున్నారని, బీజేపీ నుంచి దేశాన్ని రక్షించడం కేసీఆర్కే సాధ్యమవుతుందని వారు నమ్ముతున్నారని అన్నారు. అందుకే మునుగోడు ఫలితం తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీ గడ్డపై కాలు మోపబోతున్నారని స్పష్టం చేశారు.