ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్
ముషీరాబాద్, మార్చి 15: దివంగత కాన్షీరాం అడుగుజాడల్లో నడిస్తేనే దళితులకు రాజ్యాధికారం సాకారమవుతుందని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జీ చెన్నయ్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దళితులకు ఓటు విలువ తెలిసేలా చేసి, అభివృద్ధికి బాటలు వేసిన కాన్షీరాం చిరస్మరనీయుడని అన్నారు. సోమవారం కాన్షీరాం 87వ జయంతి సందర్భంగా హైదరాబాద్ విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దళితుల అభివృద్ధికి కాన్షీరాం ఎనలేని కృషిచేశారని, దేశంలో అంబేద్కర్కు నిజమైన వారసుడు కాన్షీరామేనని అన్నారు. ఓటు ద్వారా సమాజంలో మార్పు, అధికారం సాధించవచ్చని నిరూపించారని కొనియాడారు. ఆయన బాటలో నడిస్తేనే దళితుల బతుకులు మారుతాయని, ఆ దిశగా పయనించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు కొల్లూరి వెంకట్, శ్యామ్రావు, తిరుపతి, సురేశ్, రమేశ్, వేణు పాల్గొన్నారు.