హనుమకొండ చౌరస్తా, మార్చి 17: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నదని, అదే సమయంలో రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం కొనసాగిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు. శుక్రవారం హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం సెనెట్హాల్లో వీసీ రమేశ్ అధ్యక్షతన ‘ఛేంజింగ్ సినారియో ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో వినోద్కుమార్ మాట్లాడారు.
1954లోనే కేంద్రం యూపీ ముఖ్యమంత్రిని దించిందని, నెహ్రూ ప్రధానిగా ఉన్న క్రమంలోనే ఆ రాష్ట్రాన్ని కూలదోసిందన్నారు. 1967లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు యూపీ, బీహార్, కేరళ, తమిళనాడుపై కేంద్ర ప్రభుత్వాలు పెత్తనం చెలాయించాయని, రాజ్యాంగాన్ని కాలరాస్తూ రాష్ట్రాల హక్కులను కబళిస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 1062 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల కోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తే గవర్నర్ నిలిపివేశారని తెలిపారు. గవర్నర్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేయక తప్పలేదన్నారు.
జీఎస్టీ ద్వారా రాష్ర్టాల హక్కులను కేంద్ర ప్రభుత్వానికి ధారాదత్తం చేశామని చెప్పారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇలా ప్రతి వస్తువుపై జీఎస్టీ ద్వారా కేంద్రానికి చెల్లిస్తున్నామని తెలిపారు. రాష్ర్టాల్లో ప్రభుత్వాలను పనిచేయకుండా చేస్తున్నది కేంద్రమేనని మండిపడ్డారు. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. ఈడీ కుంభకోణాలను రుజువు చేయలేకపోతున్నాయని అన్నారు. ఇప్పటివరకు 500కుపైగా కేసులు ఉన్నా విచారణలో బయటపెట్టింది తక్కువేనన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.