హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మాగాంధీ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ పేర్కొన్నారు. ఆ మహనీయుడిపై కొందరు రాజకీయ స్వార్థంతో అసత్యాలను ప్రచారం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్లో జరిగిన సెమినార్లో ఆయన గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్రెడ్డితో కలిసి గాంధీ జీవిత చరిత్రపై రూపొందించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.
వినోద్కుమార్ మాట్లాడుతూ..మతోన్మాద శక్తుల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాతిపితను సామాజిక మాధ్యమాల్లో అవమానిస్తున్నారని, అది మంచి సంప్రదాయం కాదని పేర్కొన్నారు. గాంధీజీ ఆలోచనా విధానంపై 33 జిల్లాల్లో చర్చ పెట్టాల్సిన ఆవశ్యకత ఉన్నదని, ఆ బాధ్యతను గున్న రాజేందర్రెడ్డి తీసుకోవాలని సూచించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణ రంగాల్లో గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్, గాంధీ గ్లోబల్ ట్రస్ట్ సంస్థలు చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో ప్రతిష్ఠాన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర ప్రతినిధులు కలీం ఖాన్, ఎంవీ గోనారెడ్డి, విజయ్కుమార్, వాణి, సురేశ్గుప్తా, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.