హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): యూనివర్సిటీల్లోనే యువత భవిష్యత్తుకు పునాది పడుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ తెలిపారు. తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ టీచర్స్ మూడో కన్వెన్షన్లో శనివారం ‘తెలంగాణలో ఉన్నత విద్య -సమకాలీన సమస్యలు-పరిష్కార మార్గాలు’ అన్న అంశంపై జరిగిన చర్చల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైద్య కళాశాలల స్థాపన, సంక్షేమ పాఠశాలలు, కళాశాలలను తెలంగాణ ప్రభుత్వం బలోపేతం చేసిందని వివరించారు.
విద్య, వైద్యరంగాల అభివృద్ధికి మరింతగా కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్యారంగాన్ని పునరుద్ధరించడం తక్షణావసరమని చెప్పారు. యూనివర్సిటీ నిర్మాణాల అభివృద్ధికి సీఎస్సార్ నిధులను వినియోగించాలని సూచించారు. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయోపరిమితిని పెంచాలని అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాల్లోని సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని టీఎస్ యూటీఏ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
అనంతరం టీఎస్ యూటీఏ లోగోను ఆవిష్కరించారు. టీఎస్ యూటీఏ అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ మల్లేశం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి, టీఎస్ యూటీఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ శ్రీనివాస్, వర్సిటీల ప్రతినిధులు మల్లికార్జున్రెడ్డి (కేయూ), గుంటి రవీందర్ (అంబేద్కర్), చలమల్ల వెంకటేశ్వర్లు, మంగు (ఉస్మానియా), పీ రజనీకాంత్ (పీజేఏయూ), పున్నైహ్ (టీయూ), సైదానాయక్ (జేఎన్టీయూహెచ్), సబీనా హెరాల్డ్ (ఎంజీయూ), సరస్వతమ్మ (టీఎంవీ), శ్రీపతిరావు (పీయూ), హరికాంత్ (ఎస్యూ), మురళీకృష్ణ (ఎస్పీఎస్టీయూ), రంజిత్కుమార్ (ఆర్జీకేయూటీ), వీర శ్రీకాంత్ (పీజేటీఎస్ఏయూ), ఎన్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.