హుజూరాబాద్, మే12 : హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం ఉప్పల్లోని రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ రైల్వేశాఖను డిమాండ్ చేశారు. శుక్రవారం ఆర్వోబీని పరిశీలించి, మాట్లాడారు. ఆరేండ్ల క్రితం పూర్తికావాల్సిన రైల్వే బ్రిడ్జికి అతీగతీ లేకపోవడం బాధాకరమన్నారు.
ప్రస్తుత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని, డిసెంబర్లోగా పూర్తిచేయాలని రైల్వే బోర్డ్ చైర్మన్ అనిల్ కుమార్ లాహోటికి లేఖ రాసినట్లు తెలిపారు. ఈ విషయమై దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఇంజినీర్ విశ్వనాథ్తో ఫోన్లో మాట్లాడినట్లు వెల్లడించారు. ఆయన వెంట మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.