హైదరాబాద్, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ): ఆయిల్పాం నర్సరీల పెంపు, సాగులో నూతన విధానాలు, కొత్తరకం విత్తనాలు పరిశీలించేందుకు రాష్ట్ర ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మలేషియాలో పర్యటిస్తున్నది. పర్యటనలో భాగంగా బృందం సభ్యులు గురువారం మలేషియా ప్రభుత్వరంగ సంస్థ ఎఫ్జీవీ సీడ్ గార్డెన్, నర్సరీని పరిశీలించారు.
సీడ్ గార్డెన్లో కొత్తరకం విత్తనాల ఉత్పత్తిని పరిశీలించి, షెడ్ నెట్లలో మొక్కల పెంపకం వివరాలను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం మలేషియా సాంకేతిక నిపుణులతో భేటీ అయ్యారు. సీడ్ గార్డెన్లో విత్తనాల రకాలు వాటి పెరుగుదల, దిగుబడులు, వారి జీవితకాలం వివరాలను అడిగి తెలుసుకొన్నారు. పర్యటనలో ఆయిలఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్రెడ్డి, మేనేజర్లు జెన్ను సత్యనారాయణ, శ్రీకాంత్రెడ్డి, బాలకృష్ణ, కల్యాణ్, నాగబాబు పవన్, ఎఫ్జీవీ ప్రతినిధులు సత్యనారాయణ, శాంసుల్, లూ, నూరిజాన్ తదితరులు పాల్గొన్నారు.