హనుమకొండ, మార్చి 4 : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ నెల 8న హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో రాష్ట్రస్థాయిలో ఘనంగా నిర్వహిస్తామని మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఈ వేడుకుల నిర్వహణ ఏర్పాట్లపై శనివారం హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర్లు, అధికారులతో ఆమె సమీక్షించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మహిళా సంక్షేమం, సాధికారతతో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. సీఎం కేసీఆర్ మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ అపూర్వ అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా అవార్డు గ్రహీతల పేర్లమీద మొకలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కమిటీ ద్వారా రాష్ట్ర స్థాయిలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను పారదర్శకంగా ఎంపిక చేసి అవార్డులు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. ఒక్కొక్కరికి ప్రశంసా పత్రంతోపాటు లక్ష రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ను కూడా ఆహ్వానించనున్నట్టు ఆమె తెలిపారు.