అయిజ /జోగులాంబ గద్వాల : జిల్లాలోని అయిజ మండలం ఉత్తనూర్ గ్రామంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లాల అండర్ – 19 జూనియర్ బాస్కెట్ బాల్ క్రీడా పోటీలు గురువారం అట్ట హాసంగా ప్రారంభమయ్యాయి. ఉత్తనూర్ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ సౌజన్యంతో తెలంగాణ రాష్ట్ర బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలకు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల నుంచి 20 బాలురు, బాలికల జట్లు తరలివచ్చాయి.
ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు జగనున్న ఈ పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర బాస్కెట్ బాల్ జట్టుకు ఎంపిక చేయనున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ జెడ్పిటీసీ తిరుమల్ రెడ్డి, తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నార్మన్ ఐజాక్, కార్యదర్శి నీలిమ, మాజీ ఎంపీపీ సుందర్ రాజు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ రాముడు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కోచ్ లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
నేడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాక..
ఉత్తనూర్ గ్రామంలో జరుగనున్న తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లాల అండర్ – 19 జూనియర్ బాస్కెట్ బాల్ క్రీడా పోటీలను తిలకించేందుకు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జెడ్పీచైర్ పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ్ రెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి హాజరవుతున్నట్లు మాజీ జెడ్పీటీసీ తిరుమల్ రెడ్డి తెలిపారు.