హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): దేశంలో విచ్ఛిన్నకర శక్తుల విజృంభణ ఆగాలని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను చూస్తే ఆందోళన కలుగుతున్నదని, ఇటువంటి సమయంలో మహాత్ముడు మళ్లీ పుడితే బాగుండని అన్నారు. సోమవారం శాసనసభ ప్రాంగణంలోని జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీలు గంగాధర్గౌడ్, ఫారుక్హుస్సేన్, బండా ప్రకాశ్, అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు, బీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేశ్రెడ్డి తదితరులు పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భం గా గుత్తా మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం, లౌకికవాద ఆచరణ కోసం మహాత్మాగాంధీ జీవితాంతం పరితపించారని కొనియాడారు. ప్రపంచానికి అహింసామార్గాన్ని ఆచరణగా చూపిన దార్శనికుడని కీర్తించారు. దేశంలో లౌకికవాదం కొనసాగాలని, రాజ్యాంగం కల్పించిన హకుల ఆచరణ కొనసాగాలని ఆకాంక్షించారు. సమాఖ్య స్ఫూర్తిని అర్థం చేసుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఇబ్బందులకు గురిచేయడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ సజావుగా సాగాలంటే గవర్నర్, ప్రభుత్వం, శాసనవ్యవస్థ రాజ్యాంగానికి లోబడి పరస్పరం గౌరవించుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో గాంధీజీ కలలుగన్న అసలైన గ్రామస్వరాజ్యం ఆవిష్కృతమైందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కొనియాడారు. గాంధీజీ అహింసామార్గంలో దేశానికి స్వాతంత్య్రం సముపార్జించిన స్ఫూర్తితో కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించారని తెలిపారు. ప్రకృతి వనరులు, మానవ వనరులను సమపాళ్లల్లో జోడించి ముందుకు సాగడం వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం 20 ఉత్తమ గ్రామ పంచాయతీలను ప్రకటిస్తే అందులో 19 రాష్ర్టానికి చెందినవే ఉండటం అందుకు నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వాలు, నాయకులు మారడం కాదు, ప్రజల బతుకులు మారాలనే ఆలోచన ఉదాత్తమైనదని అన్నారు. తన 47 ఏండ్ల రాజకీయ జీవితంలో గ్రామసీమలు ఇంతగా పురోగమించిన పరిస్థితిని ఇప్పుడే చూస్తున్నానని తెలిపారు.