రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల పట్టణంలో రెండెకరాల స్థలంలో గిరిజన భవన్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు వెల్లడించారు. గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చేతుల మీదుగా త్వరలోనే భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. తెలంగాణలో గిరిజన, ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత కేసీఆర్దేనన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మండలంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దుమాల గ్రామంలో యాదవసంఘాలు నిర్వహిస్తున్న బీరప్ప జాతరకు హాజరయ్యారు. రాజన్నపేట, బాకూరుపల్లి తండాలో రూ.30 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాలను కేటీఆర్ ప్రారంభించారు. ‘మన ఊరు మనబడి’ కార్యక్రమంలో భాగంగా రాజన్నపేటలో రూ.33 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను, రాచర్ల తిమ్మాపూర్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో కేటీఆర్ మాట్లాడుతూ.. సమైక్య పాలనలో వెనుకబడిన తండాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయని చెప్పారు. ఒక్కో గ్రామ పంచాయతీకి రూ. 20 లక్షలతో పక్కా భవనాలను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దూసుకు పోతున్నదని, దేశానికి దిశానిర్దేశం చేసే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని తెలిపారు. 8 ఏండ్లలో కేసీఆర్ సర్కారు అల్కటి పనులు చేసిందంటూ విమర్శించే ప్రతిపక్షాలు.. అరవై ఏండ్లలో ఎందుకు ఆ పనులను చేయలేకపోయారని ప్రశ్నించారు. తాను గ్రామాలకు చేసిన అభివృద్ధి పనులేంటో మీముందు పెడుతున్నానని, మీరు చేసిన పనేంటో చెప్పాలంటూ పల్లెల్లోకి వచ్చే ప్రతిపక్ష పార్టీల నేతలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
‘మావనాటే..మావరాజ్ (మా తాండాలో మారాజ్యం)’ అన్న ఆదివాసీ, గిరిజనుల కలను తెలంగాణ సర్కారు సాకారం చేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని 3,416 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని పేర్కొన్నారు. తండాలను పంచాయతీలుగా మార్చడం వల్ల 31వేల మంది గిరిజనులు సర్పంచులు, ఎంపీటీసీలుగా పరిపాలనలో భాగమయ్యారని వివరించారు. సమైక్య రాష్ట్రంలో 6శాతంగా ఉన్న రిజర్వేషన్లను 10శాతానికి పెంచినట్లు చెప్పారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పోడు భూములకు కేసీఆర్ సర్కారు శాశ్వత పరిష్కారం చూపుతున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. త్వరలో గిరిజనుల పోడు భూముల పట్టాలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. పోడు, లావణి భూములకు సంబంధించి విస్తృత అధ్యయనం తర్వాత అర్హులందరికీ పట్టాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వానికి ఆడబిడ్డల కష్టాలు తెలుసని, అందుకే అడగకపోయినా అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. మనసున్న వ్యక్తి, ప్రజల బాధలు అర్థం చేసుకున్న వ్యక్తి సీఎం కావడం వల్లే దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని స్పష్టంచేశారు. ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలకు ప్రాధాన్యక్రమంలో గృహలక్ష్మి పథకం కింద ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. ఇండ్లు రాని వారు ఎలాంటి ఆందోళన చెందవద్దని అందరికి ఇండ్లు వచ్చేలా చూస్తానని భరోసా ఇచ్చారు. ఎవరు అడగకుండానే బీడీ కార్మికులకు నెలకు రూ. 2016లు పింఛను అందిస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. గ్రామాల్లో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు త్వరలో కుట్టుమిషన్లను పంపిణీ చేస్తామని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, నిధుల వల్లే పల్లెలు అభివృద్ధిలో మెరుస్తున్నాయని, దేశంలోనే అగ్రభాగాన నిలుస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘దేశంలో ఉన్న ఆదర్శ గ్రామాలలో సింహభాగం తెలంగాణలోని పంచాయతీలే అవార్డులు అందుకోవడం గర్వించదగ్గ విషయం. ఒక్కొక్క పంచాయతీ మీద ప్రత్యేక దృష్టి పెట్టి మరీ అభివృద్ధి చేస్తున్న ఫలితమిది. 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క రాజన్నపేట గ్రామంలోనే రూ. 20 కోట్ల 38 లక్షలు అభివృద్ధి పనుల కోసం ఖర్చుపెట్టినం. బాకూరుపల్లె తండాలో రూ. 2కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినం’ అని కేటీఆర్ వివరించారు. రైతు కుటుంబాలకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో అమలు చేస్తున్న రైతుబీమా ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ఇప్పటివరకు లక్ష మంది రైతులకు రూ. 5వేల కోట్లకు పైగా బీమా పరిహారం అందించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీఎస్టీపీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్పీచైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, సర్పంచులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట మండలంలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. కిష్టూనాయక్తండాలో ఆగి సమస్యలు తెలుసుకున్నారు. మంత్రి కాన్వాయ్ దుమాల నుంచి రాజన్నపేటకు వెళ్తుండగా.. కేటీఆర్ రాక గురించి తెలుసుకొన్న కిష్టూనాయక్తండా మహిళలు రోడ్డుమీదికొచ్చి నిలబడ్డారు. వారిని చూసి మంత్రి కేటీఆర్ తన కాన్వాయ్ని ఆపారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నెలరోజుల్లో పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి వస్తానని చెప్పారు. గ్రామంలో మహిళాసంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.