హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల సమాధాన పత్రాల ఆన్స్క్రీన్ మూల్యాంకనం వచ్చే మార్చి నుంచే చేపట్టనున్నట్టు రాష్ట్ర ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్మిట్టల్ వెల్లడించారు. లెక్చరర్లు ఇంట్లో లేదా కాలేజీలో ఉండి పేపర్లు దిద్దే సౌలభ్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇంటర్ బోర్డు తీర్మానాన్ని అనుసరించే ఈ విధానాన్ని అమలుచేస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ఆర్ట్స్, కామర్స్, భాషలకు చెందిన 35 లక్షల పేపర్లను ఆన్లైన్ ద్వారా వాల్యూయేషన్ చేయనున్నట్టు చెప్పారు. వచ్చే రెండేండ్లల్లో సైన్స్ సబ్జెక్టులకు విస్తరించి పూర్తిస్థాయిలో అమలుచేస్తామని వెల్లడించారు.
మూల్యాంకనం పారదర్శకంగా ఉంటుందని, త్వరగా పూర్తవుతుందని, తప్పులు నివారించడం సాధ్యమని తెలిపారు. ఎలాంటి సందేహాలకు తావులేదని, ఇప్పటికే ఈ విధానం మన రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల్లో అమలవుతున్నదని గుర్తుచేశారు. నాంపల్లిలోని ఇంటర్ విద్య కమిషనరేట్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆన్స్క్రీన్ మూల్యాంకనం ప్రకటనతోపాటు పలు సందేహాలను నివృత్తిచేశారు. విద్యార్థుల సౌకర్యం కోసమే ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని, గతంలో విద్యార్థి రీవ్యాల్యుయేషన్ కోరితే జిల్లాల నుంచి పేపర్లు తెప్పించడంలో తీవ్ర జాప్యం జరిగేదని, ఆన్లైన్ వల్ల వేగం పెరుగుతుందని చెప్పారు.
మూల్యాంకన టెండర్లలో అవకతవకలకు ఆసారమే లేదని, సమర్థత లేని సంస్థలు పాల్గొనే వీలు లేకుండా పటిష్ట నిబంధనలు పెట్టామని తెలిపారు. పేపర్లు దిద్దేవారికి ఇచ్చే టీఏ, డీఏ ఖర్చులను నివారించవచ్చని, పనిభారం కూడా తగ్గుతుందని తెలిపారు. ఆన్స్క్రీన్ మూల్యాంకనం కోసం అధ్యాపకులకు అవసరమైన శిక్షణ ఇస్తామని తెలిపారు. పేపర్ వ్యాల్యుయేషన్పై ఎలాంటి గందరగోళానికి తావులేదని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఇతరుల మాటలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తిచేశారు.
ఓయూలో ఏటా 30 లక్షల పేపర్లు ఆన్స్క్రీన్లోనే
ఆన్స్క్రీన్ మూల్యాంకనంతో అనేకలాభాలున్నాయని పలువురు ఉన్నతాధికారులు వెల్లడించారు. సాంకేతిక విద్యామండలి, బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, ఉస్మానియా వర్సిటీ, పాలిటెక్నిక్ కాలేజీలకు చెందిన బాధ్యులు తమ అనుభవాలను మీడియాకు వివరించారు. 2018 నుంచి తాము ఆన్స్క్రీన్ మూల్యాంకనాన్ని అమలుచేస్తున్నామని బీఆర్ అంబేద్కర్ వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఏవీఎన్రెడ్డి తెలిపారు.
ఈ విధానంతో వారం, పది రోజుల్లోనే సర్టిఫికెట్లు చేతికందుతున్నాయని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఏటా 30 లక్షల వరకు డిగ్రీ కోర్సుల సమాధాన పత్రాలను ఆన్స్క్రీన్ మూల్యాంకనం చేస్తున్నట్టు ఓయూ అడిషనల్ కంట్రోలర్ డాక్టర్ కృష్ణంరాజు పేర్కొన్నారు. పాలిటెక్నిక్ జవాబు పత్రాలను నాలుగున్నరేండ్లుగా విజయవంతంగా ఆన్స్క్రీన్ మూల్యాంకనం చేయిస్తున్నట్టు సాంకేతిక విద్యామండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ తెలిపారు. సెమిస్టర్, మిడ్ సెమిస్టర్ అంతా కలిపి 26 లక్షల పేపర్లను సులభంగా మూల్యాంకనం చేయించగలుగుతున్నామని వెల్లడించారు. ‘పాలిటెక్నిక్ జవాబుపత్రాల మూల్యాంకనానికి గతంలో క్యాంపులు ఉండేది. అధ్యాపకులు క్యాంపులకు హాజరైతే రెగ్యులర్ తరగతుల నిర్వహణకు ఆటంకం కలిగేది. కానిప్పుడు తరగతులు కొనసాగిస్తూనే.. రోజుకు 80 పేపర్లను మూల్యాంకనం చేస్తున్నాం’ అని పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ నాగరాజు తెలిపారు.