హైదరాబాద్, అక్టోబర్5 (నమస్తే తెలంగాణ): జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఏపీ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల పనులను నిలిపివేయాలని తెలంగాణ సర్కారు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ని డిమాండ్ చేసింది. ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్-1 పనులను చేపడుతున్నదని, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ విస్తరణకు పూనుకున్నదని, వెంటనే ఆ పనులను నిలిపివేయాలని, ఆ దిశగా సత్వర చర్యలు చేపట్టాలని కోరుతూ (కేఆర్ఎంబీ)కి తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ గురువారం లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా, ట్రిబ్యునల్ అవార్డులకు విరుద్ధంగా ఔట్బేసిన్కు కృష్ణా జలాలను తరలించేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని గుర్తుచేశారు. ఇదేవిషయమై ఎన్జీటీని ఆశ్రయించగా పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను చేపట్టకూడదని 2020లో ఆదేశాలు జారీ చేసిందని గుర్తుచేశారు. ఆ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా రాయలసీమ ఎత్తిపోతల పథకం తొలిదశ పనులను చేపట్టేందుకు పూనుకున్నదని వివరించారు.
జూన్ నుంచి జూలై మధ్యలో, 2913 క్యూసెక్కుల సామర్థ్యంతో 6 పంపులను ఏర్పాటుచేసి, మొత్తంగా 59టీఎంసీలను ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా పూర్తిగా ఔట్సైడ్ బేసిన్కు తరలించేందుకు అవసరమైన పనులను చేపట్టేందుకు ఏపీ ఉత్తర్వులు జారీచేసిందని తెలంగాణ వెల్లడించింది. అదీగాక శ్రీశైలం నుంచి చెన్నై తాగునీటికి 15టీఎంసీలను మాత్రమే అందివ్వాల్సి ఉందని, కాలువ సామర్థ్యం కూడా 1500 క్యూసెక్కులే ఉండాలని అంతర్రాష్ట్ర ఒప్పందం నిర్దేశించిందని గుర్తుచేశారు. కానీ అందుకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం కాలువ సామర్థ్యాన్ని తొలుత 11,500 క్యూసెక్కులకు, అటు తరువాత 44వేల క్యూసెక్కులకు, ప్రస్తుతం 80వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచేందుకు పూనుకున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకంలో భాగంగానే పోతిరెడ్డిపాడు లైనింగ్, విస్తరణ పనులను చేపడుతున్నదని, ఇప్పటికే శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ను పూర్తిచేసిందని బోర్డుకు తెలంగాణ తెలిపింది. ఏపీ చేపట్టిన పనులకు సీడబ్ల్యూసీ నుంచి ఎలాంటి అనుమతులు లేవని, ప్రస్తుతం ఈ అంశాలన్ని ట్రిబ్యునల్2 ఎదుట విచారణలో ఉన్నాయని వివరించారు. అయినప్పటికీ ఏపీ ఎన్జీటీ ఉత్తర్వులను, ట్రిబ్యునల్ అవార్డులను ఉల్లంఘిస్తూ పనులను చేపట్టేందుకు పూనుకోవడం పట్ల తెలంగాణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకనైనా రాయలసీమ లిఫ్ట్ పనులపై ఏపీ ప్రభుత్వం ముందుకు పోకుండా నిలువరించాలని, ఆ దిశగా సత్వరమే చర్యలు చేపట్టాలని బోర్డును డిమాండ్ చేసింది.