Telangana Martyrs | ఆరు దశాబ్దాల పోరాటం.. ఎందరో అమరుల త్యాగఫలం.. కేసీఆర్ దృఢ సంకల్పంతో తెలంగాణ ప్రజల ఆకాంక్ష సాకారమైంది. తమ చావుతో నైనా ప్రత్యేక రాష్ట్రం రావాలని ప్రాణాలర్పించిన బిడ్డల ఆశయాలు స్వరాష్ట్రంలో ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి.
స్వరాష్ట్రంలో స్వపరిపాలన చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవైపు అమరుల ఆశయాలను ఆచరణలో పెడుతూనే మరోవైపు త్యాగధనుల కుటుంబాలను అక్కున చేర్చుకొంటున్నారు. ఎప్పటికప్పుడు వారికి అండగా నిలుస్తున్నారు. అమరుల త్యాగాల స్ఫూర్తితో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచేలా సుపరిపాలన సాగిస్తున్నారు. ఆది నుంచీ అమరుల త్యాగాలను తలుచుకొన్నాకే ఏ పనైనా మొదలెడుతున్నారు.
హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఢిల్లీ నుంచి తొలిసారి 2014 ఫిబ్రవరి 28న హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టిన కేసీఆర్ నేరుగా గన్పార్క్లోని అమరుల స్థూపాన్ని సందర్శించి, ఘననివాళులర్పించారు. 2014 ఎన్నికల్లో గెలిచిన అనంతరం తిరిగి అమరుల స్థూపం వద్దకే వచ్చి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరమే పరేడ్ గ్రౌండ్కు వెళ్లి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ‘రాష్ట్ర సాధన ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల కీర్తి అజరామరంగా నిలిచిపోతుంది. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో అభ్యుద యం వైపు పయనిస్తాం, అభివృద్ధి సాధి స్తాం..అన్ని రకాలుగా బాగుపడతామని తెలంగాణ ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వ పాలన ప్రజలు కేంద్ర బిందువుగా.. ప్రజా సమస్యల పరిషారమే ఇతివృత్తంగా కొనసాగుతుందని నిండు మనసుతో ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి హామీ ఇస్తున్నాను.
తెలంగాణా సమాజం అభ్యుదయం అంచులను ముద్దాడాలంటే ప్రభుత్వ పాలన ఉద్యమ పంథాలోనే పారదర్శకంగా కొనసాగాలనే కర్తవ్యాన్ని పరిపూర్ణంగా నేను స్వీకరిస్తున్నాను.’ అంటూ సీఎం కేసీఆర్ వాగ్దానం చేయడమేకాదు తొమ్మిదేండ్లుగా అందులోని ప్రతి మాటనూ ఆచరణలో పెడుతుండడం గర్వకారణం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకమూ అమరుల ఆశయాలను ప్రతిఫలిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతి బడ్జెట్ను అమరులవీరుల స్థూపం వద్ద ఉంచి నివాళులర్పించిన తర్వాతే అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే అది పండుగైనా, మరే ఉత్సవమైనా, పథకమైనా ఏ కార్యక్రమాన్ని చేపట్టినా తొలుత అమరవీరులకు నివాళులు అర్పించడమే సంప్రదాయంగా కొనసాగిస్తున్నది. అమరుల స్ఫూర్తితో సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన సాగిస్తున్నారు. వారి ఆశయాల బాటలో తెలంగాణ సర్కారు అద్భుత విజయాలు సాధిస్తున్నది. తమ బిడ్డల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ అభివృద్ధిని చూసి నేడు ప్రతి అమరుడి కుటుంబం మురుస్తున్నది.
భరత్ ఉంటే సంబురపడేటోడు
ప్రత్యేక రాష్ట్రం కోసం ఉవ్వెత్తున ఆందోళనలు, ఉద్యమాలు సాగుతున్నాయి. అందులో సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు చెందిన సోమగాని భరత్ చురుగ్గా పాల్గొన్నాడు. తన చావుతోనైనా ఆంధ్రా నాయకులు, వారికి వత్తాసు పలుకుతున్న వారికి కనువిప్పు కలుగాలని లేఖ రాసి, 2013 మే 20న ఓయూ క్యాంపస్లోని ఆర్ట్స్ కాలేజీకి ఎదురుగా ఉరేసుకొని ఆత్మబలిదానం చేసుకొన్నాడు.
సూర్యాపేట: కొడుకు మరణవార్త తెలుసుకొని అతడి తల్లిదండ్రులు సోమగాని కృష్ణ, సుజాత హతాశులయ్యారు. తెలంగాణ వచ్చి.. ఇంత అభివృద్ధి జరుగుతున్న సమయంలో తమ బిడ్డ ఉంటే ఎంత సంబురపడిపోయేవాడో అని నిత్యం యాదిజేసుకుంటున్నారు. ‘కొడుకు చనిపోయి దిక్కులేని పక్షుల్లా అయిన మమ్మల్ని సీఎం కేసీఆర్ ఆదుకొన్నరు. రూ. 10 లక్షల సాయంజేసిన్రు. నా బిడ్డ జ్యోత్స్నకు సర్కారీ నౌకరీ ఇచ్చి.. కుటుంబాన్ని నిలబెట్టిన్రు. ఇయ్యాల తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతున్నది. అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కుతున్నాయి. ప్రజలకు ఏ సమస్య రాకుండా, లేకుండా సీఎం కేసీఆర్ చేస్తున్నారు. అమరుల ఆశయాలు నెరవేరుతున్నయ్’ అని భరత్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం నా అన్న ఎంతో ఆరాటపడ్డడు. తన చావుతోనైనా తెలంగాణ రావాలని ఆత్మబలిదానం చేసిండు. చనిపోయే ముందు నాకు చెల్లెలంటే ఇష్టమని, ఆమెను ఆదుకోవాలని ఉత్తరం రాసి జేబులో పెట్టుకొన్నడు. నా అన్న ఆఖరి కోరికను తెలంగాణ ప్రభుత్వం తీర్చింది. 2016 జూన్ 2న నాకు నల్లగొండ జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇచ్చింది. ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ వచ్చింది. నా అన్న కల కన్నట్టు స్వరాష్ట్రంలో సంతోషంగా బతుకుతున్నా.’ అని భరత్ సోదరి జ్యోత్స్న ఉద్వేగభరితంగా చెప్పింది.
మమ్మల్ని ఆదుకున్నది ఒక్క కేసీఆరే..
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామానికి చెందిన కొండేటి వేణుగోపాల్రెడ్డి 2010 జనవరి 19 సాయంత్రం 4 గంటలకు ఒంటి మీద కిరోసిన్ పోసుకొని ఆత్మార్పణ చేసుకున్నారు. ఆయన మృతితో తెలంగాణ అంతటా ఆందోళనలు, ఉద్రిక్తలు పెరిగాయి.
పెన్పహాడ్: ‘వేణుగోపాల్రెడ్డి మృతితో తెలంగాణ అంతటా ఆందోళనలు, ఉద్రిక్తలు పెరిగాయి. కొండేటి ప్రాణ త్యాగం వృథాకానివ్వకుండా తెలంగాణ సాధించుకొని తీరుతామని ప్రతినబూనారు. కానీ, కుటుంబాన్ని ఎవరూ ఆదుకోలేదు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం నా కొడుకు ఆత్మత్యాగానికి పాల్పడ్డాడే తప్ప ఆత్మహత్య చేసుకోలేదు. అయితే, శవం మీద ప్రమాణాలు చేసిన నాయకులెవరూ మమ్మల్ని ఆదుకోలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకనే మాకు న్యాయం జరిగింది. అమరుల కుటుంబాలను అన్నితీర్ల ఆదుకుంటున్నడు. నేడు తెలంగాణ ప్రజల సంతోషంలో నా కొడుకు వేణుగోపాల్రెడ్డిని చూసుకుంటున్నా’ అని వేణుగోపాల్రెడ్డి తల్లి లక్ష్మమ్మ కంటతడి పెడుతూ చెప్పారు. ‘నా కొడుకు తెలంగాణ కోసం నిలువునా కాలిపోయిండు.. ‘కాలి మాడిపోయిన నా కొడుకు జీవితం తెలంగాణకు వెలుగులు ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం మంచిగ అయితున్నది. సీఎం కేసీఆర్ నాకు 10 లక్షల రూపాయలు ఇచ్చిండు. నా చెల్లె కొడుకుకు ఉద్యోగం ఇచ్చిండు’అంటూ చెప్పుకొచ్చింది.
నెరవేరిన యాదయ్య ఆశయం
‘తెలంగాణ రాష్ట్రం కోసం నేను చచ్చిపోతున్నా.. తెలంగాణ ఉద్యమంలో ఇదే చివరి బలిదానం కావాలి’.. అంటూ 2010 ఫిబ్రవరి 21న ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేటు దగ్గర ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మార్పణ చేసుకున్నారు సిరిపురం యాదయ్య.
రంగారెడ్డి: యాదయ్యది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం. యాదయ్య మరణంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు కుటుంబంలో ఓ వైపు ఆనందం.. తన తమ్ముడు పోయాడనే ఆవేదన ఉండేదని అంటున్నాడు యాదయ్య సోదరుడు సిరిపురం మహేశ్. తమ కుటుంబానికి సీఎం కేసీఆర్ అండగా నిలిచారని చెప్తున్నాడు. రూ. 10 లక్షలు ఆర్థికసాయం అందజేయడంతోపాటు తనకు బీసీ హాస్టల్లో కొలువు ఇచ్చి కుటుంబానికి ధైర్యం ఇచ్చారని ఆనందం వ్యక్తంచేస్తున్నాడు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ చేస్తామని చెప్పినవన్నీ చేసి చూపిస్తున్నరు. హామీ ఇవ్వని పనులుగూడ జేస్తున్నరు. స్వరాష్ట్రంలో నా తమ్ముడి ఆశయాలు నెరవేరుతున్నయ్.’ అని మహేశ్ తెలిపాడు. అందరూ నన్ను సిరిపురం యాదయ్య అన్న అని అంటుంటే గర్వంగా ఉంది. కేసీఆర్ సార్ పుణ్యమాని అని నా ఇద్దరు పిల్లలను బాగా చదివిస్తున్న.
కానిస్టేబుల్ కిష్టయ్య కలలు నెరవేరినయ్
కానిస్టేబుల్ కిష్టయ్య (పుట్టకొక్కుల కిష్టయ్య)ది కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం శివాయిపల్లి గ్రామం. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలకు తీవ్రకలత చెందాడు. మాచారెడ్డి పోలీసు స్టేషన్లో పనిచేస్తూ 2009 డిసెంబర్ 1న తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మ బలిదానం చేసుకొన్నారు.
కరీంనగర్: ప్రత్యేక రాష్ట్రం కోసం అమరుడైన కిష్టయ్య కుటుంబాన్ని తెలంగాణ సర్కారు అక్కున చేర్చుకొన్నది. ఆ కుటంబం కల నెరవేర్చి అండగా నిలిచింది. తెలంగాణ సర్కారు సహకారంతో డాక్టర్ అయిన ఆయన కూతురు ప్రియాంక, ఉద్యోగాలు పొందిన భార్య పద్మావతి, కుమారుడు రాహుల్ కేసీఆర్ పాలనపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. తమలాగే తెలంగాణ అమరుల కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయని ప్రియాంక, భార్య పద్మావతి చెప్తున్నారు. ‘సీఎం సర్ ఇచ్చిన ప్రోత్సాహం, ఆర్థిక సహాయంతోనే నేను డాక్టర్ కాగలిగాను. నాన్న చనిపోయిన నాటి నుంచే కేసీఆర్ సార్ మా కుటుంబానికి అండగా నిలబడ్డారు.’ అని ప్రియాంక చమర్చిన కళ్లను తుడుచుకొంటూ చెప్పింది. ‘నా భర్త చనిపోయినప్పుడు చాలా బాధపడ్డ. మొదటిసారి కేసీఆర్ సార్ను కలిసినప్పుడు తను కూడా చాలా బాధపడ్డరు. ఆయన ఆశయం వృథా పోనీయమని ఆనాడే అన్నరు. ఇప్పటి వరకు కేసీఆర్ సార్ అదే మాట మీద ఉన్నరు. మా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నరు. నాకు, నా కొడుకు రాహుల్కు ఉద్యోగం ఇచ్చిన్రు. మా పిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడ్డరు అంటే అందుకు కారణం కేసీఆర్ సారే’ అని కిష్టయ్య భార్య పద్మావతి తెలిపారు. తమలాంటి అమరుల కుటుంబాలకు అండగా నిలువడమేగాదు.. తెలంగాణను సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు.
తీరిన తిరుమలేశ్ కోరిక
తన చావుతోనైనా తెలంగాణ రావాలని.. తెలంగాణ వస్తే తనలాంటి వారందరికీ ఉద్యోగాలొస్తాయని పేర్కొంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడకు చెందిన నరాల తిరుమలేశ్ 2010 మార్చి 24న ఆత్మబలిదానం చేసుకొన్నాడు.
ఇబ్రహీంపట్నం: తిరుమలేశ్ మృతితో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అయితే, త మకు రూ.10 లక్షల సాయంతోపాటు రెండో కొడుకు అజయ్కుమార్కు ఉద్యోగం ఇచ్చి తెలంగాణ సర్కారు ఆదుకొన్నదని తి రుమలేశ్ తల్లి నరాల వీరమణి పేర్కొన్నది. కడుపులో దుఃఖం ఉన్నా.. స్వ రాష్ట్రంలో తనబిడ్డ కల నెరవేరినందుకు ఆనందంగా ఉన్నదని అంటున్నది. తెలంగాణ వస్తేనే తనలాంటోళ్లకు కొలువు లు వస్తయని తిరుమలేశ్ అంటుండే. కొడుకుని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన మాకు సీఎం కేసీఆర్ అండగా నిలిచిన్రు. తెలంగాణ అచ్చినంక నా కొడుకు కోరుకున్నట్టే ఎంతోమందికి కొలువులు అచ్చినయ్. నా కొడుకు కోరిక నెరవేరింది.’ అని తిరుమలేశ్ తల్లి వీరమణి తెలిపింది.
నేటి తెలంగాణ జూసి యాదిరెడ్డి మురిసేటోడు
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని పెద్దమంగళారం గ్రామానికి చెందిన మందడి నర్సింహారెడ్డి, చంద్రమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వారిది నిరుపేద వ్యవసాయ కుటుంబం. చంద్రమ్మ ఆకుకూరలు అమ్ముతూ పిల్లలను పోషించుకొన్నది. యాదిరెడ్డి తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుడైండు. ఎక్కడ ఉద్యమం జరిగితే అక్కడికి వెళ్లిపోయేవాడు. సమైక్యపాలకులు తెలంగాణ రాకుండా అడ్డుకొంటున్నారని మనస్తాపానికి గురయ్యాడు. తెలంగాణ ఉద్యమంవైపు దేశం చూపు పడాలని ఢిల్లీకి వెళ్లి పార్లమెంటు భవనం ముందు చెట్టుకు ఉరేసుకొన్నడు.
రంగారెడ్డి: యాదిరెడ్డి చావుతో తెలంగాణ ఉద్యమం దేశం దృష్టిని ఆకర్షించింది. ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాలు తీసుకొన్న యాదిరెడ్డి కుటుంబానికి స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. ఆ కుటుంబానికి రూ. 10 లక్షల సాయం చేశారు. యాదిరెడ్డి సోదరుడు ఓంరెడ్డికి ఉద్యోగం ఇచ్చారు. ‘నా కొడుకు తెలంగాణ కోసం ప్రాణాలు తీసుకొన్నడు. చెట్టంత కొడుకు చనిపోయి దిక్కులేని స్థితిలో ఉన్న మాకు సీఎం కేసీఆర్సారు అండగా నిలిచిండు. రూ. 10 లక్షల ఆర్థిక సాయం చేయగా, ఆ పైసలతోటి నా కొడుకు పేరుమీద భూమి కొనుక్కొన్న. నా చిన్న కొడుకుకు ఉద్యోగం ఇచ్చి కుటుంబాన్ని నిలబెట్టిండు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అందరికీ అన్ని సౌలతులు జేస్తుండు. అందరినీ ఆదుకొంటున్నడు. ఇప్పుడు ఇంత డెవలప్ అయిన తెలంగాణను చూస్తే నా కొడుకు ఎంత మురిసేటోడు. నా కొడుకు కోరుకున్నట్టే తెలంగాణల అందరూ సంతోషంగా ఉన్నరు.’ అని యాదిరెడ్డి తల్లి చంద్రమ్మ పేర్కొంటున్నది.
నరేశ్ త్యాగం వృథా కాలే..
మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలంలోని శమ్నాపూర్ గ్రామానికి చెందిన భూమమ్మ, సిద్దయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. వారి చిన్న కుమారుడు ఓరగంటి నరేశ్ (18) మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న క్రమంలో తెలంగాణ రాదేమోననే బెంగతో 2012 డిసెంబర్ 31న ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మబలిదానం చేసుకొన్నాడు.
హవేళీఘనపూర్: ఎదిగివచ్చిన కొడుకును కోల్పోయిన ఆ తల్లిదండ్రులకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. ఆ కుటుంబానికి రూ. 10 లక్షల సాయం అందజేయడంతోపాటు నరేశ్ అన్న నర్సింలుకు రామాయంపేట ప్రభుత్వ బాలుర వసతి గృహంలో వార్డెన్గా ఉద్యోగం ఇచ్చారు. ప్రభుత్వ సాయంతో భూమి, రెండు బర్రెలు కొనుక్కొని ఆ తల్లిదండ్రులు జీవనం సాగిస్తున్నారు. ‘తెలంగాణ కోసం నా కొడుకు ప్రాణాలు వదిలిండు. కొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మా కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేసిం ది. నా చిన్న కొడుకుకు ఉద్యోగం ఇప్పించి నా కుమారుడు లేని లోటును తీర్చింది. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తున్నాం.’ అని నరేశ్ తల్లి పేర్కొన్నది. ‘మాకు సీఎం కేసీఆర్ అండగా నిలబడ్డరు. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా మారింది. ఇవన్నీ చూ స్తుంటే నా తమ్ముడి త్యాగం వృథా కాలేదనిపిస్తున్నది’ అని నరేశ్ అన్న నర్సింలు అన్నాడు.
రవీందర్ కల సాకారం
సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణానికి చెందిన పిట్ల రవీందర్ (రాజు) తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో చురుగ్గా పాల్గొన్నాడు. హైదరాబాద్లో చదువుకొంటున్న రవీందర్.. సకల జనుల సమ్మె తర్వాత బతుకమ్మ పండుగ కోసం సొంతూరికి వచ్చాడు. జోగిపేట తహసీల్దార్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో రవీందర్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తూ ఆత్మార్పణం చేసుకొన్నాడు.
అందోల్: అందోల్ గడ్డపై ఉద్యమ కాగడాను రగిలించాడు. రవీందర్ 2011 అక్టోబర్ 1న దవాఖానలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. చెట్టంత కొడుకు మృతితో తల్లి మంచంపట్టింది. విషాదంలో మునిగిపోయిన ఆ కుటుంబాన్ని స్వరాష్ట్రంలో తెలంగాణ సర్కారు అక్కున చేర్చుకొన్నది. రూ.10 లక్షల ఆర్థిక సాయంతోపాటు రవీందర్ సోదరుడు అనిల్కు ఇరిగేషన్ శాఖలో ఉద్యోగం ఇచ్చింది. ‘తమ్ముడు కోరుకున్న తెలంగాణ వచ్చింది. సీఎం కేసీఆర్ సుపరిపాలనలో అన్ని రంగాల్లోనూ ఎంతో అభివృద్ధి చెందుతున్నది. పదేండ్ల కిందటి తెలంగాణ.. ఇప్పటి తెలంగాణను పోల్చిచూస్తే ఎంతో మార్పు కనిపిస్తున్నది. పక్కరాష్ర్టాలు సైతం అసూయ పడేలా సీఎం కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. నా తమ్ముడు బతికి ఉంటే ఎంతో సంతోషపడేవాడు. స్వరాష్ట్రంలో నా తమ్ముడి కల నెరవేరుతున్నది.’ అని రవీందర్ సోదరుడు అనిల్ ఆనందంగా చెప్తున్నాడు.
615 మంది కుటుంబాలకు 10 లక్షల చొప్పున సాయం
స్వరాష్ట్రంలో పాలనాపగ్గాలు చేపట్టిన సీఎం కేసీఆర్ నాటి నుంచీ అమరుల స్ఫూర్తిని చాటుతుండడమేగాకుండా రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలను ఆదుకొంటున్నారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్లు 615 మందిని గుర్తించారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున రూ. 61.50 కోట్ల సాయాన్ని అందజేశారు. అమరువీరుల కుటుంబాల్లో ఉన్నవారికి ఉద్యోగావకాశం కల్పించారు. అమరవీరుల పిల్లల ఆలనాపాలనా ప్రభుత్వమే చేపట్టింది. వారి అభీష్టం మేరకు చదివించే బాధ్యతలను కూడా ప్రభుత్వమే భూజానికెత్తుకున్నది. ఎంతో మంది అమరవీరుల కుటుంబాల పిల్లలను ఉన్నత చదువులు చదివించింది. ఆ కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఇంటి పెద్ద దిక్కులా అండగా నిలిచారు.