హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం చేనేత, పవర్లూమ్ కార్మికులకు వివిధ పథకాల కింద 2017-18 నుంచి ఇప్పటివరకు రూ.412 కోట్ల వరకు ఆర్థిక సాయం అందించింది. పనులులేక ఇబ్బంది పడుతున్న నేతన్నలను ఆదుకొనేందుకు బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లు వీరికి ఇవ్వడం ద్వారా రూ.1,436.93 కోట్ల వరకు చెల్లించింది. నేతన్నలు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకొనేందుకు వీలుగా వివిధ జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనల్లో స్టాల్స్ ఏర్పాటుకు అయ్యే ఖర్చులు చెల్లిస్తున్నది. బీమా సౌకర్యాన్ని కూడా అమలుచేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం మాత్రం నేతన్నల సంక్షేమానికి చెప్పుకోదగ్గ సహకారం అందించకుండా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నది.
స్వరాష్ట్రంలో చేనేతకు ప్రాధాన్యం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి నేతన్నల పరిస్థితి కడు దయనీయంగా ఉన్న విషయం విదితమే. చేనేతరంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురికావడంతో నేత కార్మికులు గుజరాత్, మహారాష్ట్రలకు వలస పోవడం, ఇతర రంగాల వైపు వెళ్లారు. మరికొందరు ఆత్మహత్యలు చేసుకొన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, పరిశ్రమలతోపాటు చేనేత రంగాన్ని కూడా అత్యంత ప్రాధాన్య రంగంగా గుర్తించి నేతన్నలను ఆదుకొనేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. కనీవినీ ఎరుగని రీతిలో వివిధ రకాల పథకాలను ప్రవేశపెట్టి ఆదుకొన్నది. చేనేత, పవర్లూమ్ కార్మికులకు విడివిడిగా సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నది.
ఇందులో ముఖ్యంగా చేనేత మిత్ర, చేనేత కార్మికులు, మాస్టర్ వీవర్స్, చేనేత సంఘాలు, టీఎస్సీవో కొనుగోలుచేసే నూలు రంగులు, రసాయనాలపై 40 శాతం రాయితీ నేరుగా లబ్ధిదారు బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తున్నారు. పొదుపు పథకం నేతన్నకు చేయూత ద్వారా వారు చేసే పొదుపునకు రెండు రెట్లు అదనంగా కలిపి ఇస్తున్నారు. నూతన డిజైన్ల పరిశోధనలు, అభివృద్ధి, బ్రాండింగ్ ప్రమోషన్ కోసం సహాయం చేస్తున్నది. రుణమాఫీ, మగ్గాల ఆధునికీకరణ, క్యాష్ క్రెడిట్ స్కీమ్, పావలా వడ్డీ వంటి పథకాలను అమలుచేస్తున్నారు. బతుకమ్మ చీరలే కాకుండా సంక్షేమ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది యూనిఫారాలు వంటివి కూడా చేనేత సంఘాలనుంచే ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. దీంతో చేనేత కార్మికులకు చాలావరకు ఉపాధి లభిస్తున్నది.