హైదరాబాద్ : అంశాల వారీగా పక్కా ప్రణాళికతో తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరంగా కష్టించి పని చేస్తున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. శనివారం నగరంలోని జూబ్లీహిల్స్ ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డీ. లో ఇటీవల ప్రభుత్వ జూనియర్ అసిస్టెంట్స్గా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణా తరగతులను ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కే. రామకృష్ణారావుతో కలిసి వినోద్కుమార్ ప్రారంభించారు. అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన ఉద్యమ స్పూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ అంశాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పాలనను సాగిస్తున్నట్లు చెప్పారు.
కోతల్లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్యుత్ను ఇతర రాష్ట్రాలకు విక్రయించే స్థాయికి రాష్ట్రం ఎదిగిందన్నారు. అభ్యర్థులు తమ సర్వీస్లో నిజాయితీగా, కష్టపడి పనిచేసి పాలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఆర్ డీ అదనపు డైరెక్టర్ జెనరల్ హర్ ప్రీత్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.