Budget | హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): త్వరలో అసెంబ్లీని సమావేశపరచి, వార్షిక బడ్జెట్ను ప్రతిపాదించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు సన్నాహకంగా ఆదివారం మంత్రిమండలి సమావేశం నిర్వహించనున్నది. ఈ భేటీ సచివాలయంలోని ఆరో అంతస్థులో జరుగనున్నట్టు సీఎస్ శాంతికుమారి శుక్రవారం సమాచారం అందించారు.
బడ్జెట్ పద్దుకు ఆమోదం, సమావేశాలు ఎప్పటి నుంచి, ఎప్పటి వరకు నిర్వహించాలి? తదితర అంశాలపై చర్చించనున్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 8 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. గవర్నర్ ప్రసంగంతో సభను ప్రారంభించి, 9న ధన్యవాద తీర్మానంపై చర్చించాలని నిర్ణయించినట్టు తెలిసింది. 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. ఒకరోజు గడువు ఇచ్చి 12 నుంచి 5 రోజులపాటు వరుసగా సమావేశాలు నిర్వహించాలని, బడ్జెట్పై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.