హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): బీజేపీ అంటేనే ఉత్తరాది పార్టీ అని మొదట్నుంచీ భావన ఉన్నది. ఆ పార్టీలో ఉత్తరాది వారు ఏలికలై పల్లకీ ఎక్కుతుంటే.. దక్షిణాది వారిని బోయీలుగా చూస్తున్నారని విమర్శకులు అంటున్నారు.. ఆ పార్టీ వైఖరిని నిశితంగా గమనిస్తే దక్షిణాదిపై వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీలో ఉత్తరాది కోటరీ బలం అధికం. దక్షిణాది నేతలకు పదవులు దక్కకుండా కుట్రచేయడం.. ఒక వేళ దక్కితే వారికి సహకరించకపోవడం, అవమానించడం ఆ పార్టీ నేతల నైజమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
అవమానాలే దిక్కు..
పార్టీకి ఎంత సేవ చేసినా, ఉత్తరాది కోటరీకి నచ్చకపోతే అవమానించి పంపడం బీజేపీ నైజం. తెహల్కా జర్నలిస్టు స్టింగ్ ఆపరేషన్ చేసి పార్టీకి విరాళమంటూ డబ్బులిచ్చి.. దాన్ని లంచంగా చూపించి అవమానిస్తే.. ఆయనకు అండగా నిలవాల్సిన బీజేపీ.. అధ్యక్ష పదవినుంచి తప్పించడమే కాకుండా.. అవినీతి కేసులో జైలుకు పోతే.. కనీసం పట్టించుకోలేదు. బెయిల్పై బయటకు వచ్చాక పార్టీలో ఆయన నామమాత్రమయ్యారు.
వాజపేయి, అద్వానీ హయాంలో అత్యంత క్రియాశీలంగా వ్యవహరించి.. సంక్షోభాలు వచ్చిన ప్రతిసారీ చాకచక్యంగా చక్కబెట్టిన నేత వెంకయ్యనాయుడు. పార్టీ అధ్యక్ష పదవిని నిర్వహించడమే కాకుండా.. అవసరమైన సందర్భాల్లో అన్ని పార్టీల నేతలను కలుపుకొనిపోయి.. వారితో సంప్రతింపులు జరుపుతూ.. బీజేపీని అన్ని వర్గాలకు దగ్గరచేసిన నాయకుడు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కీలకమైన శాఖను నిర్వహిస్తున్న ముఖ్యనాయకుడిని.. క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న నేతను ఉన్నట్టుండి.. కేంద్ర మంత్రి పదవినుంచి తప్పించి.. ప్ర త్యక్ష రాజకీయాలకు దూరం చేసి.. ఉపరాష్ట్రపతి పదవిలో కూ ర్చోబెట్టారు. కనీసం ఈసారి రాష్ట్రపతి పదవికైనా ఎంపిక చేస్తా రా అని ఎదురుచూస్తే.. దాన్నీ దక్కకుండా చేశారు. ఆగస్టులో జరిగే ఉపరాష్ట్రపతి పదవికి రెండోసారి నామినేట్ చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. మరి కొన్నేండ్లు రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషించాల్సిన నేత రాజకీయ జీవితాన్నే ముగించారు.
తిరుపతి వాడైన కేఎన్ గోవిందాచార్య పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని వాజపేయిని.. ‘ముఖౌటా’ (ముసుగు) అని అన్నందుకు ఆయన్ను బలవంతంగా పార్టీ నుంచి పంపించివేశారు.
క్యాబినెట్లో ప్రాతినిధ్యం తక్కువే..
దేశంలోని పెద్ద రాష్ర్టాల్లో ఐదు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ దక్షిణాదిలోనే ఉన్నాయి. అయినా మోదీ క్యాబినెట్ మంత్రుల్లో దక్షిణాది వారు ముగ్గురు మాత్రమే ఉన్నారు. తెలంగాణ నుంచి కిషన్రెడ్డి, కర్ణాటక నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. 31 క్యాబినెట్ స్థాన్లాలో దక్షిణాది ప్రాతినిధ్యం 10 శాతం కన్నా తక్కువే. వాజపేయి క్యాబినెట్లోనూ వెంకయ్యనాయుడు మినహా ఒకరిద్దరికి పదవులు ఇచ్చినా.. అన్నీ సహాయ పదవులు తప్ప క్యాబినెట్ ర్యాంకు ఇచ్చిన దాఖలా లేనేలేదని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.
‘దక్షిణాది’ అధ్యక్షులు ముగ్గురే
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ప్రస్థానాన్ని గమనిస్తే వివక్ష స్పష్టంగా కనిపిస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. బీజేపీది సుమారు 42 ఏండ్ల ప్రస్థానం. 1980లో వాజపేయి మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పటివరకు 11 మంది అధ్యక్షుల్లో దక్షిణాది నుంచి తమిళనాడుకు చెందిన జానా కృష్ణమూర్తి, తెలుగువారైన బంగారు లక్ష్మణ్, వెంకయ్యనాయుడు మాత్రమే అధ్యక్షులుగా పనిచేశారు.
ఢిల్లీలో పట్టించుకోరు
దక్షిణాది నేతలకు ఢిల్లీలో పట్టించుకునే నాథుడే లేరు. రాష్ట్ర అధ్యక్షుడు సైతం ఢిల్లీ నుంచి కబురు వస్తే తప్ప వెళ్లే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. ఏదైనా విషయాన్ని నేరుగా పార్టీ పెద్దలతో చర్చించలేరు. కిషన్రెడ్డి కేంద్ర మంత్రే అయినా ఢిల్లీలో పరపతి దాదాపు శూన్యమని రాష్ట్ర బీజేపీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. పేరుకు మూడు శాఖలు ఉన్నా, అక్కడున్న ఒక్క అధికారి కూడా ఆయన మాట వినరని వారే చెప్తున్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఉన్న నలుగురు ఎంపీల్లో సోయం బాపూరావు ఒకరు. కానీ ఆయనకు రాష్ట్ర పార్టీలో, ఢిల్లీలో ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదని ఆయన వాపోతున్నారు. రాష్ట్ర స్థాయి సమావేశాలకు బాపూరావుకు ఆహ్వానం ఉండదని, ఫ్లెక్సీలు, పోస్టర్లలో ఫొటో కనిపించదన్నది బహిరంగ రహస్యమే. ఇక్కడే ఇలా ఉంటే ఢిల్లీలో ఆయన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇలా బీజేపీ మొదటి నుంచీ దక్షిణాదిపై వివక్ష చూపుతూనే ఉన్నది. దాన్ని కొనసాగిస్తూనే ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.