హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ నిధికి ఏటా రూ.10 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని, ప్రమాదవశాత్తు న్యాయవాది మరణిస్తే వారి కుటుంబానికి రూ.4 లక్షలు అందజేయాలని తెలంగాణ బార్ కౌన్సిల్ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డికి విజ్ఞప్తి చేసింది. న్యాయవాదులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి నేతృత్వంలో సభ్యులు శనివారం హైదరాబాద్లోని అరణ్య భవన్లో ఇంద్రకరణ్రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించి, నిర్వహణ బాధ్యతను అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్కు అప్పగించిందని అన్నారు. దీనిద్వారా వేలాదిమంది న్యాయవాదులకు ఇన్సూరెన్స్ పాలసీలు అందిస్తున్నట్టు చెప్పారు. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని నిధులు కేటాయించిన దాఖలాలు లేవని అన్నారు. మంత్రిని కలిసిన వారిలో బార్ కౌన్సిల్ సభ్యులు గండ్ర మోహన్రావు, రాజేందర్రెడ్డి, అనంతసేన్రెడ్డి, కొండారెడ్డి, జితేందర్రెడ్డి, ఫణీంద్ర భార్గవ్, ముఖీద్, మధుసూదన్రావు, జనార్దన్, రామారావు, పాలకుర్తి కిరణ్, భుజంగరావు, న్యాయశాఖ అదనపు కార్యదర్శి మన్నన్ ఉన్నారు.