హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : త్వరలో రెండో దశ గొర్రెల పంపిణీని చేపడుతామని రాష్ట్ర పశుసంవర్ధక, సినీమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వెల్లడించారు. ఇప్పటికే డీడీలు కట్టినవారికి గొర్రెలు అందజేస్తామని, మిగిలిన వారిచేత డీడీలు కట్టించాలని ఆయన ఎమ్మెల్యేలను కోరారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు నోముల భగత్, చల్లా ధర్మారెడ్డి, సుంకె రవిశంకర్, సండ్ర వెంకట వీరయ్య అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
గ్రామీణ వృత్తి వికాసం కోసం దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని వివరించారు. గొర్రెల పంపిణీ మొదటి దశ ద్వారా రాష్ట్రంలోని యాదవ సోదరులు లబ్ధి పొందారని, అదే స్ఫూర్తితో రెండో దశను త్వరలో చేపడుతామన్నారు. గతానుభవాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని, ఈ క్రమంలోనే సంపద సృష్టిపై లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ద్వారానే గొర్రెల పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని, మార్చి చివరి వారంలో గానీ, ఏప్రిల్ మొదటివారంలో కానీ ప్రారంభించి మూడు నాలుగు నెలల్లో రెండో దశను పూర్తి చేస్తామని మంత్రి తలసాని వివరించారు.