హైదరాబాద్, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ): వ్యవసాయరంగంలో తెలంగాణ, అయోవా రాష్ర్టాలు కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ ఆడమ్ గ్రెగ్ పేర్కొన్నారు. అతి తక్కువ కాలంలోనే తెలంగాణలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు అద్భుత ప్రగతి సాధించాయని కితాబిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఎస్ నిరంజన్రెడ్డి.. అయోవా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గత తొమ్మిదేండ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని ఆడమ్ గ్రెగ్కు వివరించారు. రాష్ట్రంలో పెరిగిన సాగు విస్తీర్ణం, ఆహార ధాన్యాల ఉత్పత్తి గురించి చెప్పారు. అమెరికాలో వ్యవసాయిక రాష్ట్రంగా పేరొందిన అయోవాకు, తెలంగాణకు అనేక సారూప్యతలు ఉన్నాయని అన్నారు. రెండు రాష్ర్టాలు ఆహార ధాన్యాలు, పౌల్ట్రీ, మాంసం ఉత్పత్తిలో నంబర్ వన్గా నిలిచాయని, భవిష్యత్తులో అనేక అంశాల్లో పరస్పర సహకారానికి అవకాశాలున్నాయని వివరించారు.
అనంతరం మంత్రి నిరంజన్రెడ్డి అయోవా రాష్ట్ర వ్యవసాయ మంత్రి మైక్ నెయిగ్ను కలుసుకున్నారు. అయోవా శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్ చేసిన కృషి వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగి అనేక దేశాలు తిండిగింజల విషయంలో స్వయం సమృద్ధి సాధించాయని, అదే మాదిరిగా తమ ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలతో తెలంగాణ దేశానికి ధాన్యాగారంగా మారిందని తెలిపారు. రాష్ట్రంలో రెండో హరిత విప్లవం ద్వారా ధాన్యం ఉత్పత్తి ఆరు రెట్లు పెరిగిందని, పాడి పరిశ్రమ అభివృద్ధి ద్వారా శ్వేత విప్లవం, చేపల పెంపకంలో నీలి విప్లవం, మాంసోత్పత్తిలో రికార్డు సృష్టించి పింక్ రెవల్యూషన్ సాధించిన తెలంగాణ, ఇప్పుడు నూనె గింజల ఉత్పత్తిలో నూతన శిఖరాలను చేరి పసుపు విప్లవాన్ని సాధించే దిశగా పురోగమిస్తున్నది వివరించారు. దీనిపై ఆశ్చర్యానికి గురైన మైక్ నెయిగ్ త్వరలోనే రాష్ట్రాన్ని సందర్శించి ఈ విజయాలను స్వయంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అయోవా స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్ను సందర్శించిన మంత్రి నిరంజన్రెడ్డి అక్కడి ప్రెసిడెంట్ వెండీ వింటర్స్టీన్ను కలుసుకున్నారు. అయోవా స్టేట్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాల మధ్య స్టూడెంట్, ఫ్యాకల్టీ బదిలీ, పరిశోధనలలో పరస్పర సహకారంపై చర్చించారు. ఈ సమావేశాల్లో తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు పాల్గొన్నారు.