హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): స్టార్టప్ల రూపకల్పనలో తెలంగాణ ముందంజలో ఉన్నదని, ఒక్క ఐటీ రంగంలో సుమారు 2 వేల స్టార్టప్లను నెలకొల్పినట్టు కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాలా ప్రశంసించారు. 2047 నాటికి పాడిపరిశ్రమ, మత్స్యరంగాల్లో దేశం అగ్రస్థానంలో ఉండేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని చెప్పారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా మంగళవారం కేంద్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఓ హోటల్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, స్టార్టప్ ఇండియా, సీఐఐ సంయుక్తంగా గ్రాండ్ స్టార్టప్ కన్వెన్షన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను కేంద్ర మంత్రులు పురుషోత్తమ్ రూపాలా, డాక్టర్ సంజీవ్కుమార్ బల్యాన్, సహాయ మంత్రి మురుగన్, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి రూపాలా మాట్లాడుతూ పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం ద్వారా దేశవ్యాప్తంగా పాడి రైతులు అభివృద్ధి సాధించవచ్చని పేర్కొన్నారు.
పశుపోషణ ద్వారా గ్రామీణ ఆదాయం చాలా పెరుగుతుందని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని మాట్లాడుతూ అత్యధిక మంది ఉపాధి పొందుతున్న పాడి పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పాడి రైతులకు అనేక విధాలుగా చేయూత అందిస్తున్నామని వివరించారు. 2014కు ముందు నష్టాల్లో ఉన్న విజయ డెయిరీ..ప్రభుత్వం తీసుకొన్న చర్యలతో ప్రస్తుతం రూ.800 కోట్ల టర్నోవర్కు చేరుకొన్నదని చెప్పారు. విజయ డెయిరీ ఉత్పత్తులు ప్రజలకు మరింత చేరువయ్యేలా నూతన ఔట్లెట్లను పెద్దఎత్తున ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రూ.250 కోట్లతో మెగా డెయిరీ ప్లాంట్ నిర్మాణం జరుగుతున్నదని, దీన్ని ఆగస్టులో ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్ల పంపిణీతో గొర్రెల సంపద భారీగా పెరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ కార్యదర్శి రాజేశ్కుమార్ సింగ్, విజయ డెయిరీ చైర్మన్ సోమా భరత్కుమార్, గోట్ అండ్ షీప్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, పశుసంవర్ధకశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్సిన్హా, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రామచందర్,టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి, స్టార్టప్ల నిర్వాహకులు, నిపుణులు పాల్గొన్నారు.