హైదరాబాద్: నేడు పాత, కొత్త నగరాలను కలిపే ఫ్లై ఓవర్ను ప్రారంభించుకుంటున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. పైవంతెన ప్రారంభంతో కొత్త ఏడాదిని ప్రారంభిస్తున్నామని చెప్పారు. షేక్పేట్ ఫ్లై ఓవర్ను ప్రారంభిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. 2.71 కిలోమీటర్ల పొడవునా ఆరు లైన్లతో ఫ్లై ఓవర్ను నిర్మించామని వెల్లడించారు. టోలిచౌకి నుంచి రాయదుర్గాన్ని కలిపే ఈ పైవంతెన నిర్మాణానికి రూ.333 కోట్ల వెచ్చించామన్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు తీర్చడంలో మరో మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
టోలిచౌకీ రిలయన్స్ మార్ట్ నుంచి షేక్పేట్, రాయదుర్గం ముల్కం వరకు 2.71 కిలోమీటర్ల మేర నిర్మితమైన ఫ్లై ఓవర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. శనివారం ఉదయం 11.30 గంటలకు జాతికి అంకితమివ్వనున్నారు. దాదాపు మూడు కిలోమీటర్ల పొడవున్న ఇది నగరంలో పొడవైన ఫ్లై ఓవర్లలో ఒకటిగా నిలవనుంది. దీంతో మెహదీపట్నం-హైటెక్ సిటీ మధ్య ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.