హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వెయ్యి మంది డాక్టర్ల నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకున్నదని, దసరా నాటికి ఉత్తర్వులు అందజేస్తామని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. అసెంబ్లీలో వైద్య సిబ్బంది పదవీ విరమణ వయసు పెంపు సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు.0
స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎం, ఇతర సిబ్బంది నియామకానికి త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని..గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో 800 మంది సీనియర్ రెసిడెంట్లను ఇటీవలే పూర్తిగా జిల్లాల్లోనే నియమించామని వెల్లడించారు. దుబ్బాకలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు తుదిదశలో ఉన్నదని, 15 రోజుల్లో ప్రారంభమవుతుందన్నారు. తెలంగాణ ఆవిర్భవానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో 3 డయాలసిస్ సెంటర్లు ఉంటే, ఇప్పుడు 103కు చేరాయని చెప్పారు.