హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): కరోనా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మంగళవారం నుంచి ఆఫ్లైన్లో భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తిరుపతిలోని భూదేవి, శ్రీనివాసం కాంప్లెక్సులు, గోవిందరాజస్వామి సత్రంలో కౌంటర్లు తెరిచి టికెట్లను పంపిణీ చేస్తున్నది. దాదాపు ఏడాదిన్నర తర్వాత టీటీడీ సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభించింది. బుధవారం శ్రీవారిని దర్శించుకునే భక్తులకు మంగళవారం నుంచే టోకెన్లు జారీచేశారు. రోజుకు 15 వేల టోకెన్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి క్యూలైన్లలో నిల్చున్న భక్తులు దర్శన టోకెన్లు పొందుతున్నారు.