హైదరాబాద్ : హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో చివరి రోజు శనివారం పుష్పయాగాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుగంధాల్ని వెదజల్లే రంగు రంగుల పుష్పాలు, పత్రాలను శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసస్వామివారికి సమర్పించారు.
ఉత్సవాల్లో , నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకులు , అధికార అనధికారులు , భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని వేద పండితులు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి భక్తులను కాపాడాలని వేంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తూ భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు వైష్ణవాలయాలలో పుష్పయాగం నిర్వహిస్తారని చెప్పారు.
తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల పూలు, ఆరు రకాల ఆకులు కలిపి మొత్తం మూడు టన్నుల పుష్పాలతో యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు. చివరగా నక్షత్ర హారతి ఇచ్చారు.