Srisailam Temple | శ్రీశైల మహా క్షేత్రంలో శ్రావణమాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం తెల్లవారుజామునే మహా మంగళహారతి తర్వాత భక్తులకు దర్శనాలు కల్పించారు. మాసం తొలిరోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో క్షేత్రం సందడిగా మారింది. ప్రతీ సంవత్పరంలానే ఆలయ ప్రాంగణంలోని వీరశిరోమండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి శివచతుస్సప్తాహ అఖండ భజనలు ఈవో లవన్న ప్రారంభించారు.
భజన కార్యక్రమంలో కర్నూల్ నుంచి ఐదు భజన బృందాలు, కర్ణాటక నుంచి రెండు భజన బృందాలు నిరంతరాయంగా రేంయిబవళ్లు శ్రావణ శుద్ధ పాడ్యమి నుంచి బాద్రపద పాడ్యమి వరకు నెలరోజుల పాటు ఓం నమః శివాయ పంచాక్షరీ మంత్రాని పఠిస్తూ భజనలు చేయనున్నారు. భక్తుల్లో ఆధ్యాత్మిక భావన పెంపోంది కేవలం పంచాక్షరి నామంతోనే కలియుగంలో ముక్తి పొందుతారని పురాణాల్లో చెప్పినట్లు పండితులు తెలిపారు. కార్యక్రమంలో ఈవోతో పాటు ఏఈవో మోహన్, అర్చక వేదపండితులు, భజన బృందాలు పాల్గొన్నారు.
భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రధానాలయ ప్రాకారంలోని త్రిఫల వృక్షం కింద కొలువైన దత్తాత్రేయస్వామికి గురువారం ప్రత్యేక పూజలను నిర్వహించినట్లు ఈవో ఎస్ లవన్న తెలిపారు. లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ఉదయం అభిషేకార్చనలు శాస్త్రోక్తంగా జరిపించినట్లు చెప్పారు. కళారాధనలో భాగంగా ఆలయ దక్షిణమాడ వీధిలోని వేదికపై చిన్నారులు చేసిన నృత్యాలు భక్తులను అలరించాయి.
భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్కు చెందిన టీ కృష్ణమూర్తి రూ.ఐదులక్షల విరాళాన్ని అందించారు. ఆలయ ట్రస్ట్బోర్డ్ చైర్మెన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి విరాళాన్ని అందించారు. అందులో భాగంగా నిత్యాన్న ప్రసాదానికి రూ.3,98,000, గో సంరక్షణ నిధికి రూ.1,02,000 విరాళాన్ని ఇచ్చారు. దాతలకు భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞాపిక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు మేరోజోత్ హనుమంత్ నాయక్, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, దేవస్థానం ఈఈ రామకృష్ణ పాల్గొన్నారు.
శ్రీశైల దేవస్థానానికి రూ.2లక్షల విరాళాన్ని హైదరాబాద్కు చెందిన మహిసాయి శ్రీనివాస్ చెక్కురూపంలో ఇచ్చారు. ఆ విరాళాన్ని స్వామివారి ఆలయం పడమటి ధ్వజస్తంభానికి బంగారు తాపడం కోసం ఆలయ ఈఈ రామకృష్ణకు అందజేశారు. దాతలకు భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞాపిక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు హనుమంత్ నాయక్, ఆలయ సహయక స్థపతి జవహర్లు పాల్గొన్నారు.