శ్రీశైలం : శ్రీశైలం మహాక్షేత్ర గ్రామ దేవత అంకాళమ్మ ( Ankalamma ) అమ్మవారికి ఆలయ అధికారులు, అర్చకులు ఆదివారం ఘనంగా బోనం ( Bonam ) సమర్పించారు. మూల నక్షత్రం సందర్భంగా లోక కల్యాణం కోసం దేవస్థానం (Temple) తరుఫున బోనాలు సమర్పించడం ఇదే తొలిసారి. ఆలయ కార్యనిర్వహణాధికారి (EO) ఎస్.లవన్న, ప్రధానార్చకులు శివప్రసాద్ స్వామి, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు పి. మార్కండేయ శాస్త్రి, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఐఎన్వి. మోహన్, అర్చకస్వాములు, వేదపండితులు కలిసి సంప్రదాయబద్ధంగా నూతన పట్టువస్త్రాలు, పసుపుకుంకుమలు, గాజులు, ఫలాలు, పుష్పాలు సమర్పించి పూజలు నిర్వహించారు.
అనంతరం అంకాళమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, అతివృష్టి, అనావృష్టి నివారించాలని అమ్మవారిని కోరినట్లు ఆలయ అధికారులు,అర్చకులు తెలిపారు. అగ్నిప్రమాదాలు, వాహనప్రమాదాలు జరుగకుండా, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ బోనం సమర్పించినట్లు వెల్లడించారు. ఇకపై ప్రతియేట అమ్మవారికి బోనం సమర్పిస్తామని వారు పేర్కొన్నారు.