వెంగళరావునగర్, ఫిబ్రవరి 21: ఈ నెల 17న రూ.7 కోట్ల వజ్రాభరణాలతో ఉడాయించిన కారు డ్రైవర్ శ్రీనివాస్ను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఎత్తుకెళ్లిన బంగారు, వజ్రాభరణాలను అడవితో గొయ్యి తీసి దాచిపెట్టగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. హైదరాబాద్కు చెందిన రాధిక అనే మహిళా జ్యువెలరీ వ్యాపారి వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ (28) కారులో ఉన్న రూ.7 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలతో ఈ నెల 17న పరారయ్యాడు. కూకట్పల్లి సమీపంలో ఉన్న మెట్రో షాపింగ్ మాల్ పార్కింగ్లో కారు వదిలేశాడు. బంగారం, వజ్రాభరణాలను బ్యాగ్లో సర్దేసి ఆటో ఎక్కి మాదాపూర్లోని యజమానురాలు రాధిక ఉండే మైహోం భోజ అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నాడు.
అక్కడ పార్కింగ్లో ఉంచిన తన బైక్పై శంషాబాద్ చేరుకొని శ్రీశైలం హైవే రూట్లో వెళ్లాడు. యజమానురాలి ఏటీఎం కార్డును ఉపయోగించి కొత్త సెల్ఫోన్, సిమ్ కార్డు కొన్నాడు. అనంతరం వరంగల్ సమీపంలోని నర్సంపేటలో ఉన్న తన బంధువు ఇంటికి వెళ్లాడు. చోరీ చేసొచ్చిన విషయాన్ని దాచి కొత్తఫోన్, కొత్తసిమ్ను బంధువుకు ఇచ్చి అతడి ఫోన్ను సిమ్కార్డును శ్రీనివాస్ తీసుకున్నాడు. బంగారు వజ్రాభరణాలను కారు డ్రైవర్ శ్రీనివాస్ చోరీచేసి పారిపోయాడని టీవీల్లో వచ్చే వార్తలను చూసిన బంధువు శ్రీనివాస్కు ఫోన్ చేసి చెప్పాడు. కంగారు పడొద్దని బంధువును శ్రీనివాస్ సముదాయించాడు.
హైదరాబాద్ నుంచి పారిపోయిన శ్రీనివాస్ తన స్వస్థలమైన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు చేరాడు. జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతమైన కొయ్యలగూడెం వెళ్లి అక్కడ అడవిలో గొయ్యి తవ్వాడు. కాజేసి తెచ్చిన రూ.7 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను గోతిలో దాచి పెట్టాడు. శ్రీనివాస్ యజమానురాలి ఏటీఎం కార్డుతో కొన్న కొత్త సిమ్ సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. బంగారు వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నగలకు సంబంధించి ఎటువంటి పత్రాలు, బిల్లులు లేకపోవడంతో పోలీసులు ఐటీ అధికారులకు సమాచారమిచ్చారు. పూర్తి వివరాలను రాబట్టిన తర్వాత నిందితుడు శ్రీనివాస్ను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది.