కడ్తాల్, ఏప్రిల్ 19 : ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటలు అప్రకటిత కరెంటు కోతలతో ఎండిపోతున్నాయని, ప్రజా ప్రభుత్వానికి అన్నదాతల అరిగోస పట్టదా? అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ రేవంత్ సర్కార్పై ధ్వజమెత్తారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామంలో ఎండిపోయిన మొక్కజొన్న, వరి పంటలను మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. వ్యవసాయానికి ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వకపోవడంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొక్కజొన్నకు కనీస మద్దతు ధర ప్రకటించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల సంఖను పెంచాలని, రైతులు పండించిన పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఏపీలో చూసిన కరెంటు కోతలు, ఎండిపోయిన పంటలు, కాలిపోయిన మోటర్లు, యూరియా కోసం క్యూలైన్లను మళ్లీ కాంగ్రెస్ పాలనలో చూస్తున్నామని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు రైతులకు, ప్రజలకు శాపంగా మారాయని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నిర్మలాశ్రీశైలంగౌడ్, మాజీ జడ్పీటీసీ దశరథ్నాయక్, నాయకులు, రైతులు పాల్గొన్నారు.