అల్వాల్, సెప్టెంబర్ 17: తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం అల్వాల్ దీక్షా శిబిరం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహారదీక్షను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక పొంతన లేని కారణాలు చెప్పడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వద్ద వందల ఎకరాల భూమి ఉండి కూడా ఉద్యమకారులకు ఇవ్వడానికి చేతులు రావడం లేదని, కాలయాపన చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
హామీల అమలులో ఇంకా జాప్యం చేస్తే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసి ఉద్యమకారుల పక్షాన గళం విప్పుతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జేఏసీ నాయకుడు సురేందర్రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసినప్పుడు అల్వాల్ ప్రజలు తమ సత్తా చాటారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నోటితో ఒకటి చెప్తూ ఆచరణలో మరోలా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. మాజీ కార్పొరేటర్ చింతల శాంతిశ్రీనివాస్రెడ్డి, ఉద్యమకారులు సురేందర్రెడ్డి, పుట్నాల కృష్ణ, సుధీర్, అనిల్, సంతోష్, రషీద్, వీరస్వామి, మల్లేశ్, సామ కిరణ్కుమార్రెడ్డి, పరమేశ్, కిరణ్, కీర్తిశ్రీనివాస్, ముత్యాలు, నర్సింహ, రామయ్య, గణేశ్ పాల్గొన్నారు.