కోహీర్, నవంబర్3: కోహీర్ తహసీల్దార్ కార్యాలయంలో టైపిస్టుగా విధులు నిర్వహించే శ్రీకాంత్రెడ్డి.. కవేలికి చెందిన ఓ రైతు నుంచి రూ.4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కాడు. ఏసీబీ మెదక్ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కవేలిలోని సర్వే నంబర్ 69లో ఉన్న తన ఎకరన్నర భూమి వక్ఫ్బోర్డులో నమోదైందని, దీంతో తనకు రైతుబంధు రావడం లేదని ఈ ఏడాది మార్చిలో రైతు తహసీల్ కార్యాలయంలో సంప్రదించాడు. తన భూమిని వక్ఫ్బోర్డు నుంచి తొలగించాలని దరఖాస్తు చేసుకున్నాడు. తన సమస్యను తహసీల్ కార్యాలయంలో టైపిస్టుగా విధులు నిర్వహించే శ్రీకాంత్రెడ్డికి వివరించాడు. అయితే తనకు రూ.10 వేలు ఇస్తే సమస్యను పరిష్కరిస్తానని రైతుకు చెప్పాడు. చివరకు రూ.4 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. శుక్రవారం సాయంత్రం జహీరాబాద్ బస్టాండు సమీపంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ మెదక్ డీఎస్పీ ఆనంద్కుమార్ ఆధ్వర్యంలో అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం కోహీర్ తహసీల్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ చేపట్టారు. ఈ తనిఖీల్లో ఏసీబీ సీఐలు వెంకటరాజ్గౌడ్, రమేశ్, సిబ్బంది ఉన్నారు.