హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మానగర్లో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనభాగ్యం లభించనున్నది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని టీటీడీకి కేటాయించింది. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో కరీంనగర్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కృషితో కరీంనగర్ ప్రజల చిరకాల స్వప్నం సాకారం కానున్నది. సోమవారం హైదరాబాద్లోని తన నివాసంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కరీంనగర్లో శ్రీవారి ఆలయ నిర్మాణ అనుమతి పత్రాలను గంగుల కమలాకర్, బోయినపల్లి వినోద్కుమార్, టీటీడీ తెలంగాణ అడ్వైజరీ కమిటీ చైర్మన్ భాసరరావుకు అందజేశారు.
సీఎం కేసీఆర్ విజ్ఞప్తితో ఏపీ సీఎం జగన్ ఆదేశాలతో కరీంనగర్ పట్టణంలో రూ.20 కోట్ల వ్యయంతో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. మే 31న ఉదయం 7:26 గంటలకు వేదమంత్రోచ్ఛారణల నడుమ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తామని వివరించారు. త్వరలోనే తిరుమలకు వెళ్లి శ్రీవారి ఆలయ నిర్మాణాల నమూనాలపై చర్చిస్తామని, సకాలంలో శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.