హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన బియ్యాన్ని ఈ నెల 25న వేలం వేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు 11,640 కిలోల బియ్యానికి టెండర్లను ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నది. ఆసక్తిగల వారు ఈ నెల 25లోపు ‘కార్యనిర్వహణాధికారి, టీటీడీ’ పేరుతో రూ.2,500 డీడీ తీసి, సీల్డ్ టెండర్ను తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం, జనరల్ మేనేజర్ (వేలం) కార్యాలయం లో సమర్పించాలని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. అదేరోజు సాయంత్రం టెండర్లను తెరుస్తామని, ఇతర వివరాల కోసం తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయ ఫోన్ నంబర్ 0877-2264429లో సంప్రదించాలని పేర్కొన్నారు.
శ్రీవారికి బ్యాటరీ వాహనం విరాళం
ఐడీబీఐ బ్యాంక్ డైరెక్టర్ రాకేశ్శర్మ గురువారం ఉదయం టీటీడీకి సుమారు రూ.7.67 లక్షల విలువైన 6 సీట్లు కలిగి బ్యాటరీతో నడిచే వాహనాన్ని విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ముందు వాహనానికి పూజలు నిర్వహించిన అనంతరం బ్యాంకు ప్రతినిధులు శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో రమేశ్బాబుకు వాహన తాళాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల డీఐ జానకీరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.