భద్రాచలం: భద్రాచలంలో (Bhadrachalam) శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేటి నుంచి రామయ్య కల్యాణంలో ప్రధాన ఘట్టాలు ఆవిష్కృతం కానున్నాయి. శనివారం సాయంత్రం మిథిలా స్టేడియంలో ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది. 11న శ్రీరామచంద్ర పట్టాభిషేకం వేడుక నిర్వహిస్తారు.
దేవదేవుల కల్యానానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. భక్తులు రాములవారి కల్యానాన్ని తిలకించేందుకు వీలుగా మిథాల స్టేడియంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం 2.5 లక్షల తలంబ్రాల ప్యాకెట్లు సిద్ధంచేశారు. రేపు వేడుకలకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ హాజరుకానున్నారు. మహాపట్టాభిషేకం వేడుకలో గవర్నర్ తమిళిసై పాల్గొంటారు.
వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం భద్రాద్రి దివ్యక్షేత్రంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భేరీ పూజను నేత్రపర్వంగా జరిపారు. మేళతాళాలు, వేదమంత్రాల నడుమ గరుడపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేశారు.