ఖమ్మం, మార్చి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీతారాముల కల్యాణ మంత్రాలతో దక్షిణ అయోధ్యాపురి ప్రతిధ్వనించింది. ‘శ్రీరామ.. జయరామ.. జయజయ రామ’ అన్న భక్తుల రామనామస్మరణలతో మార్మోగింది. వరుడుగా రాముడు, వధువుగా సీతమ్మను చూసి భక్తజనం పులకించింది. మొత్తానికి సీతారాముల కల్యాణ మహోత్సవం భక్తులకు కనువిందు చేసింది. ఈ వేడుకకు భద్రాద్రి శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయ ప్రాంగణంలోని మిథిలా స్టేడియం వేదికైంది. ఆలయ అర్చకులు తెల్లవారుజామున 2 గంటలకే ఆలయ తలుపులు తెరిచారు. స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, నివేదన చేపట్టారు. అనంతరం ఉత్సవమూర్తులను భక్తరామదాసు చేయించిన ఆభరణాలతో అలంకరించి భక్తుల కోలాహలం, మంగళవాయిద్యాలు, కోలాటాల నడుమ ఊరేగింపుగా మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు పునర్వసు నక్షత్రం అభిజిత్ ముహూర్తాన అర్చకులు సీతారాముల శిరస్సులపై జీలకర్ర బెల్లం ఉంచారు.
మాంగళ్యధారణ చేశారు. భక్తుల కరతాళ ధ్వనులు, జయ రామ స్తోత్రాల నడుమ కల్యాణ క్రతువు పూర్తయింది. రాములోరి కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ముత్యాల తలంబ్రాలు, పట్టువస్ర్తాలు సమర్పించారు. వేడుకకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభిషేక్రెడ్డి, జస్టిస్ శ్రీదేవి, జస్టిస్ భీమపాక నరేశ్, దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్, చినజీయర్ స్వామి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, భద్రాచలం, పాలేరు ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, పొదెం వీరయ్య, మహబూబాబాద్ ఎంపీ కవిత, ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి కనుమూరు బాపిరాజు, సహస్ర అవధాని దైవజ్ఞశర్మ, భద్రాచల ఆలయ ఈవో రమాదేవి, కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్, ఎస్పీ వినీత్ పాల్గొన్నారు. రాములోరి కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచీ భక్తులు భారీగా తరలివచ్చారు. పక్కనే ఉన్న గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకొని పునీతులయ్యారు. కాగా భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో శ్రీరాముడి పుష్కర సామ్రాజ్య మహా పట్టాభిషేకం శుక్రవారం అధికారులు శాస్ర్తోక్తంగా నిర్వహించనున్నారు. ఈ మహత్తర వేడుక ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగనున్నది. 2011లో జరిగిన పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకానికి ఐదు హోమ గుండాలు ఏర్పాటు చేయగా ఈసారి వాటి సంఖ్యను 12కు పెంచాలని వైదికులు నిర్ణయించారు.
భద్రాచల రామాలయ ప్రాంగణంలోని మిథిలా స్టేడియంలో శుక్రవారం ఘనంగా మహా పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహిస్తున్నామని దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మీడియాకు తెలిపారు. వేడుకల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా భావిస్తున్నదని అన్నారు. ఉత్సవాలకు సీఎం కేసీఆర్ రూ.కోటి ప్రత్యేక నిధులు కేటాయించినట్టు చెప్పారు. రెండేండ్లపాటు కరోనా కారణంగా వేడుకలు సరిగా నిర్వహించలేకపోయామని తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేకంగా ప్రసాదాలు, తలంబ్రాల కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
శ్రీరామనవమి రోజు దేశంలో ఎక్కడ రాములోరి కల్యాణ వేడుక నిర్వహించినా నిర్వాహకులు రెండు మంగళసూత్రాలను మాత్రమే సీతమ్మకు ధరింపజేస్తారు. కానీ భద్రాచలంలో జరిగే కల్యాణ మహోత్సవంలో మాత్రం సీతమ్మకు శ్రీరాముడు ధారణ చేసే మంగళసూత్రంలో మూడు సూత్రాలు ఉండటం విశేషం. వీటిలో ఒక సూత్రాన్ని జనక మహారాజు, రెండో సూత్రాన్ని దశరథ మహారాజు చేయించినవి కాగా భక్తరామదాసు సీతమ్మ తల్లిని తన కుమార్తెగా భావించి మూడో సూత్రాన్ని చేయించినట్టు అర్చకులు తెలిపారు.