నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో (Miryalaguda) తృటిలో పెను ప్రమాదం తప్పింది. పట్టణంలోని ఆటోనగర్ వద్ద (Auto Nagar) అద్దంకి-నార్కట్పల్లి హైవేపై శ్రీకృష్ణ ట్రావెల్స్ (Sri Krishna Travels) బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. అప్పటికీ ఆగని బస్సు పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే ప్రయాణికులు స్వల్ప గాయాలతోనే బయట పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.