హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ)/పరకాల: సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్ (55) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన శ్రీనివాస్ కొన్నేండ్లుగా హైదరాబాద్లో ఉంటున్నారు. చిన్ననాటి స్నేహితులను కలిసేందుకు స్వగ్రామానికి వచ్చిన ఆయన ఆదివారం ఉదయం కాసేపు క్రికెట్ ఆడుతూ అలసటకు లోనయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో స్నేహితులు ప్రైవేట్ దవాఖానకు తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగానే శ్రీనివాస్ ఆరోగ్యం విషమించింది. కంట్రిబ్యూటర్గా పాత్రికేయ వృత్తిని ప్రారంభించిన మెండు శ్రీనివాస్.. 27 ఏండ్ల పాటు వివిధ పత్రికల్లో పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలకు స్ఫూర్తిమంతమైన కథనాలను అందించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
సీఎం కేసీఆర్ సంతాపం
మెండు శ్రీనివాస్ హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం తెలియజేశారు. శ్రీనివాస్ మరణం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తంచేశారు. సీనియర్ జర్నలిస్టుగా, ఆంధ్రజ్యోతి పత్రిక తరపున టీఆర్ఎస్తో పాటు సీఎంవో బీట్ రిపోర్టర్గా మెండు శ్రీనివాస్ అందించిన జర్నలిజం సేవలను సీఎం గుర్తు చేసుకొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శ్రీనివాస్ మృతి పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు సంతాపం వ్యక్తంచేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొన్నారు.
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, జీ జగదీశ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, వీ శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్, ఎంపీ నామా నాగేశ్వర్రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, శేరి సుభాష్రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, క్రాంతికిరణ్, టీఎస్ఎండీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు మెండు శ్రీనివాస్ మృతికి సంతాపం తెలియజేశారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ‘నమస్తే తెలంగాణ’ స్టేట్ బ్యూరో చీఫ్ ఓరుగంటి సతీశ్తో పాటు పలువురు ప్రముఖులు శ్రీనివాస్ పార్థివదేహానికి నివాళి అర్పించారు.
జర్నలిస్టు సంఘాల సంతాపం
మెండు శ్రీనివాస్ హఠాన్మరణం పట్ల తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఆర్టీఐ కమిషనర్ కట్టా శేఖర్రెడ్డి, సమాచారశాఖ సంచాలకుడు బీ రాజమౌళి, జాయింట్ డైరెక్టర్ కే వెంకటరమణ, ‘నమస్తే తెలంగాణ’ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, ఇండియన్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు కే శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి వై నరేందర్రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి కే విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, టీయూడబ్ల్యూజేఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బీ బసవపున్నయ్య, తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు పద్మాచారి, అధ్యక్షుడు ఎం రవీంద్రకుమార్, ప్రధాన కార్యదర్శి హరీశ్కుమార్రెడ్డి, ప్రధాన సలహాదారు పవన్కుమార్గౌడ్, హైదరాబాద్ అధ్యక్షుడు నర్సింగ్రావు తదితరులు సంతాపం వ్యక్తంచేశారు.