హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లకు సాంకేతిక విద్యాశాఖ అధికారులు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఈ ఏడాది సెంట్రలైజ్డ్ అడ్మిషన్స్ ద్వారా రాష్ట్రంలోని సర్కారీ పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లన్నీ భర్తీ చేయాలని నిర్ణయించారు. ఆయా ఫీజులను కూడా ఖరారు చేశారు. ప్రతి ఏటా పాలిసెట్ ర్యాంకుల ఆధారంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తున్నారు. గతంలో సెంట్రలైజ్డ్ స్పాట్ అడ్మిషన్స్ విధానం ద్వారా ప్రైవేట్ కాలేజీల్లో మాత్రమే సీట్లను భర్తీ చేసేవారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈ విధానం అమలు చేయకపోవడంతో ప్రతి ఏటా 1,400పైగా సీట్లు మురిగిపోయేవి. ప్రభుత్వ కాలేజీల్లో సీట్లకు తీవ్రపోటీ ఉన్నా.. కౌన్సెలింగ్లో మాత్రమే సీట్లను భర్తీచేసేవారు. ఈ నేపథ్యంలో సాంకేతిక విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్స్ ద్వారా భర్తీచేయాలని ఇటీవలే నిర్ణయించారు. స్పాట్ అడ్మిషన్స్ కోసం విద్యార్థులు ఈ నెల 10 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 13 వరకు వెబ్ ఆప్షన్స్, 16న సీట్లను కేటాయిస్తామని పేర్కొన్నారు.