కామారెడ్డి : క్రీడాకారులకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం (మేజర్ ద్యానచంద్ జయంతి) సందర్భంగా యువజన, క్రీడా సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో బాన్సువాడ పట్టణం మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హాకీలో దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప క్రీడాకారుడు ద్యానచంద్. తన ప్రతిభతో వ్యక్తిగతంగా ప్రపంచంలోనే అత్యధికంగా గోల్స్ చేసిన హాకీ మాంత్రికుడు ద్యానచంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం ఆయనకు మనం ఘనంగా అర్పించే నివాళి అన్నారు.
బాన్సువాడ పట్టణంలోని క్రీడాకారుల సౌలభ్యం కోసం అన్ని వసతులతో మినీ స్టేడియం నిర్మించాం. క్రీడాకారులు దీనిని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని స్పీకర ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజా గౌడ్, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.