హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): స్పోర్ట్స్ కోటా కింద పారా క్రీడాకారులకు కూడా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో క్రీడాకారులకు కల్పించిన 2% రిజర్వేషన్ కోటాలో పారా క్రీడాకారులకు కూడా అవకాశం కల్పించాలని తీర్పు వెలువరించింది.
2021లో పంచాయతీ కార్యదర్శుల నియామకం నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్లో పారా క్రీడాకారులకు రిజర్వేషన్ కల్పించలేదంటూ సూర్యాపేట జిల్లా మేళ్లచెరువుకు చెందిన ఆర్ నరేశ్యాదవ్ సహా ఐదుగురు దాఖలు చేసిన వ్యాజంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్భూయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది. 2012లో ప్రభుత్వం జారీచేసిన జీవో-74లో క్రీడల కోటా రిజర్వేషన్లల్లో పారా క్రీడాకారులను మినహాయించడం అన్యాయమని, చట్ట వ్యతిరేకమని పిటిషనర్ తరపు న్యాయవాది బాగ్గేకర్ ఆకాష్కుమార్ వాదించారు. ఈ వాదనను హైకోర్టు ఆమోదించింది.