మహబూబాబాద్ : ఆటలను ప్రోత్సహించేందుకే క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు, యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగడానికి సీఎం తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని సూచించారన్నారు.
అందులో భాగంగా ప్రతి వార్డులో గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ప్రతి గ్రామపంచాయతీలో, అర్బన్ ప్రాంతాలలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. క్రీడా ప్రాంగణాలను యువత సద్వినియోగం చేసుకుని క్రీడా రంగాల్లో రాణించాలని సూచించారు. ఈ సందర్భంగా క్రీడా ప్రాంగణంలో మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్లతో కలిసి వాలీబాల్ ఆడారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రాం మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, స్థానిక వార్డ్ కౌన్సిలర్ మార్నెని వెంకన్న, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, జిల్లా స్పోర్ట్స్ అధికారి అనిల్, మున్సిపల్ డీఈఈ ఉపేందర్, ఎంఈవో బి.సురేష్, తదితరులు పాల్గొన్నారు.