కేపీహెచ్బీ కాలనీ/ హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ): ఆధ్యాత్మిక గురువు ముసుగులో ఉన్న హంతకుడు అతడు.. బాగా డబ్బున్న రియల్టర్తో పరిచయం పెంచుకున్నాడు. మరికొంతమంది స్నేహితులను అతనికి పరిచయం చేశాడు. అంతా స్నేహితులుగా మెలిగారు. అయితే, తన వ్యవహారం, మోసాలపై తరచూ కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని రియల్టర్ బెదిరించాడు. దీంతో అతన్ని అంతం చేయాలని స్కెచ్ వేశాడా ఆధ్యాత్మిక గురువు. మంచూరియాలో నిద్రమాత్రల పౌడర్ కలిపి, తన స్నేహితులతోనే అతన్ని చంపించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి విజయ్భాస్కర్రెడ్డి (63) ఆరేండ్లుగా హైదరాబాద్లోని కేపీహెచ్బీలో నివాసం ఉంటున్నాడు. అతనికి ఆధ్యాత్మిక గురువు త్రిలోక్నాథ్ అలియాస్ గురూజీతో పరిచయం ఏర్పడింది. అతడు మాజీ సైనికోద్యోగి మల్లేశ్, రియల్ఎస్టేట్ వ్యాపారి సుధాకర్, కృష్ణంరాజును విజయ్భాస్కర్రెడ్డికి పరిచయం చేశాడు. అందరూ స్నేహితులుగా మెలిగారు. అయితే, గురూజీ, అతని స్నేహితుల మోసపూరిత వ్యవహరాలను విజయ్భాస్కర్రెడ్డి దూషించేవాడు. వీరి మోసాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని తరచూ బెదిరించేవాడు. దీంతో అతనిపై గురూజీ, అతని స్నేహితులు కోపంతో రగిలిపోయారు. ఎలాగైనా హత్య చేయాలని భావించారు. అసలు ఈ విజయ్భాస్కర్రెడ్డి బ్యాగ్రౌండ్ ఏంటి? సీబీఐ, సీఐడీకి ఫిర్యాదు చేస్తానని ఎందుకు అంటున్నాడు? అతని వద్ద ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయ్? అన్న అంశాలను ఆరా తీసేందుకు మల్లేశ్ కుమారుడిని ఏజెంట్గా పెట్టుకున్నారు. విజయ్భాస్కర్రెడ్డితో మచ్చిక చేసుకునేందుకు అతడు 5 నెలలుగా నివాసం ఉంటున్న నెస్ట్ అవే హాస్టల్కు పంపారు. మల్లేశ్ కుమారుడు విజయ్భాస్కర్రెడ్డితో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. గత నెల 19న విజయ్భాస్కర్రెడ్డి ఇతర స్నేహితులతో పార్టీ చేసుకుంటుండగా ఆ విషయాన్ని గురూజీకి చెప్పాడు. వెంటనే అతడి హత్యకు గురూజీ స్కెచ్ వేశాడు. ఆర్ఎంపీ శ్రావణ్ దగ్గర నిద్రమాత్రలు తీసుకొని పౌడర్గా చేసి మంచూరియాలో కలపాలని మల్లేశ్ కుమారుడికి చెప్పాడు. ప్లాన్ను పక్కాగా అమలు చేయటంతో అది తిన్న విజయ్భాస్కర్రెడ్డి, అతని స్నేహితులు నిద్రమత్తులోకి జారుకున్నారు. వెంటనే హాస్టల్కు వచ్చిన మల్లేశ్, సుధాకర్, కృష్ణంరాజు.. విజయభాస్కర్రెడ్డిని కారులో ఎక్కించుకుని శ్రీశైలం వైపు బయలుదేరారు. నిద్రమత్తులో ఉండగానే పిడిగుద్దులతో హత్యచేశారు.
శ్రీశైలం మార్గంలోని సున్నిపెంట వద్ద ఓ కాటికాపరిని సంప్రదించి తమ బంధువు చనిపోయాడని, దహనం చేయాలని హంతకులు నమ్మించారు. అందుకు అతనికి రూ.15 వేలు యూపీఐ ద్వారా చెల్లించారు. అనుమానం వచ్చిన కాటికాపరి దహనం చేసేముందు వాళ్లకు తెలియకుండా కట్టెలపై ఉన్న విజయ్భాస్కర్రెడ్డి మృతదేహన్ని ఫొటో తీసి పెట్టుకున్నాడు. మృతుడి ఫోన్ స్విచ్చాఫ్ ఉండటంతో అతని అల్లుడు సృజన్రెడ్డి కేపీహెచ్బీ పీఎస్లో 24వ తేదీన ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు నిజం బయటపడింది. హత్యకు పాల్పడ్డ మల్లేశ్, సుధాకర్, కృష్ణంరాజు, నిద్రమాత్రలు ఇచ్చిన ఆర్ఎంపీ డాక్టర్ శ్రావణ్ను పోలీసులు అరెస్టు చేశారు. గురూజీ, మల్లేశ్ కుమారుడు కార్తీక్ పరారీలో ఉన్నారు. వీరి కోసం తమిళనాడు, కర్ణాటక, కేరళలో పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా, మృతుడి వద్ద రూ. కోట్లు తీసుకొని, వాటిని తిరిగి ఇవ్వటానికి ఇష్టం లేకే హత్యకు గురూజీ స్కెచ్ వేశాడా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అతడు పట్టుబడితే కేసు కొలిక్కి రానున్నది.